శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By pnr
Last Updated : బుధవారం, 3 మే 2017 (15:08 IST)

రాయపాటికి చంద్రబాబు షాక్.. తితిదే ఛైర్మన్‌గా కె.మురళీమోహన్!?

తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) కొత్త ఛైర్మన్‌గా సినీ నటుడు, రాజమండ్రి ఎంపీ కె.మురళీమోహన్ నియమితులయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ పదవి కోసం ఔరంగజేబాబు దండయాత్రలు చేస్తున్న టీడీపీ సీనియర్ నేత రాయపాట

తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) కొత్త ఛైర్మన్‌గా సినీ నటుడు, రాజమండ్రి ఎంపీ కె.మురళీమోహన్ నియమితులయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ పదవి కోసం ఔరంగజేబాబు దండయాత్రలు చేస్తున్న టీడీపీ సీనియర్ నేత రాయపాటి సాంబశివరావుకు ఈ దఫా కూడా మొండి చేయిచూపించే అవకాశం ఉంది. ఇదే జరిగితే ఆయన తన ఎంపీ పదవితో పాటు... రాజకీయాలకు కూడా స్వస్తి చెప్పే అవకాశం ఉందని ఆయన సన్నిహితులు అభిప్రాయపడుతున్నారు. 
 
ప్రస్తుత తితిదే పాల‌క‌మండ‌లి ఛైర్మన్‌ పదవీకాలం గ‌త నెల 26తో ముగిసింది. దీంతో కొత్త ఛైర్మన్‌ ఎంపిక అనివార్యమైంది. ఈ ప‌ద‌వి కోసం చాలామంది పార్టీ సీనియ‌ర్లు పోటీప‌డుతుండ‌టంతో సీఎం చంద్రబాబు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. టీటీడీ పాలకమండలి ఛైర్మన్‌ రేసులో ఎంపిలు రాయ‌పాటి, సినీనటుడు కె.మురళీమోహ‌న్, జేసీ దివాక‌ర్ రెడ్డి ఉన్నారు. వీరితోపాటు ఆదాల ప్రభాకర్‌ రెడ్డి, గాలి ముద్దుకృష్ణమ‌ నాయుడు, జ్యోతుల నెహ్రూ, బీజేపీ నుంచి న‌ర్సాపురం ఎంపీ గోక‌రాజు గంగ‌రాజు ఆశావహుల జాబితాలో ఉన్నారు. 
 
ఇదిలావుంటే కేంద్రం నుంచి కూడా బడా పారిశ్రామిక‌వేత్తల పేర్లతో సిఫార్సులు వ‌స్తున్నాయి. దీంతో టీటీడీ ఛైర్మన్‌ ఎంపిక సీఎం చంద్రబాబుకు పెద్ద తలనొప్పిగా మారింది. రాయ‌పాటి సాంబ‌శివ‌రావు కాంగ్రెస్‌లో తనకు అన్యాయం జ‌రిగింద‌ని.. టీటీడీ ఛైర్మన్‌ పదవి ఇస్తానన్న హామీ మీదనే తాను టీడీపీలో చేరినట్టు బాహాటంగా ప్రకటించారు.
 
అలాగే, గత ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన సీనియర్ నేత గాలిముద్దుకృష్ణమనాయుడు కూడా తనవంతు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక రాజమండ్రి ఎంపీ, సినీ ప్రముఖుడు కె.మురళీమోహన్‌ కూడా ఈ పదవి కోసం తెర వెనుక ప్రయత్నాలు సాగిస్తున్నట్టు సమాచారం. పైగా, ఈయన చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు కూడా. 
 
ఇక మిత్రప‌క్షం బీజేపీ నుంచి ఎంపి గోకరాజు గంగ‌రాజు... టీటీడీ ఛైర్మెన్ ప‌ద‌విపై ఆశ‌లు పెట్టుకున్నారు. ఈసారి బిజేపీకి అవ‌కాశం క‌లిపించాల‌ని కోరుతున్నారు. ఇదిలావుంటే ఉత్తరభారత్‌కు చెందిన అనిల్ కుమార్ సింఘాల్‌ను తితిదే కొత్త ఈవోగా నియ‌మించ‌డం ఈ నేతల ఒత్తిడే కారణమనే గుసగుసలు వినిపిస్తున్నాయి. చివరకు సీఎం చంద్రబాబు ఎవరి వైపు మొగ్గుచూపుతారన్నది.. ఆయన విదేశీ పర్యటన పూర్తయ్యాకే క్లారిటీ రానుంది.