1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ttdj
Last Updated : శనివారం, 3 డిశెంబరు 2016 (17:49 IST)

తిరుపతి బ్యాంకులను ఆదుకుంటున్న శ్రీనివాసుడు!

దేశవ్యాప్తంగా ప్రజలు నోట్ల కోసం అల్లాడుతుంటే తిరుమల, తిరుపతిలలో మాత్రం తిరుమల శ్రీవారి వల్ల కాస్తయినా ఊరట లభిస్తోంది. ప్రత్యేకించి తిరుమలలో ప్రభుత్వం ప్రకటించినంత మేర నగదు బ్యాంకుల్లో లభ్యమవుతోంది. బ్

దేశవ్యాప్తంగా ప్రజలు నోట్ల కోసం అల్లాడుతుంటే తిరుమల, తిరుపతిలలో మాత్రం తిరుమల శ్రీవారి వల్ల కాస్తయినా ఊరట లభిస్తోంది. ప్రత్యేకించి తిరుమలలో ప్రభుత్వం ప్రకటించినంత మేర నగదు బ్యాంకుల్లో లభ్యమవుతోంది. బ్యాంకు ఖాతాల నుంచి వారానికి 24 వేలు డ్రా చేసుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకుల్లో ఇది అమలు కావడం లేదు. ఖాతాదారులు డబ్బులు డ్రా చేయడానికి వెళితే 5 వేలు, 10 వేలు కొన్ని బ్యాంకులైతే 2 వేలు చేతిలో పెట్టి డబ్బులు లేవు.. సర్దుకోండి తరువాత వచ్చి తీసుకోండి అని నచ్చజెప్పి పంపుతున్నాయి. అయితే తిరుమలలో మాత్రం ఆ పరిస్థితి లేదు. 24 వేలు పువ్వుల్లో పెట్టి ఇస్తున్నారు. వ్యాపారులకు కరెంటు ఖాతా నుంచి 50 వేలు తీసుకునే వెసులుబాటు కూడా ఉంది.
 
దీనికి కారణం.. తిరుమల బ్యాంకుల్లో ఎక్కడా నగదుకు కొరత లేకపోవడమే. ఆర్‌బిఐ నుంచి డబ్బులు రావడం లేదుగానీ శ్రీవారి భక్తుల నుంచి వస్తున్న డబ్బులే తిరుమల అవసరాలకు సరిపడా వస్తున్నాయి. రోజూ శ్రీవారి ఆలయ పరకామణిలో వచ్చిన డబ్బును తిరుమలలోని ఎస్‌బిఐ, ఆంధ్రా బ్యాంకులల్లో జమ చేస్తున్నారు. ఇటీవల కాలంలో శ్రీవారి హుండీ ఆదాయం రోజూ 3 కోట్ల రూపాయలు దాకా ఉంటోంది. ఇందులో పాతనోట్లు 20 శాతం తీసేసినా అంటే 40 లక్షల మేర పెద్ద నోట్లు పోయినా మిగిలిన నోట్లన్నీ చెలామణిలో ఉన్నవే ఉంటాయి. 
 
సాధారణంగా శ్రీవారి హుండీలో పడే కానుకల్లో 80శాతం చిన్ననోట్లే. శ్రీవారి హుండీ ద్వారానే తిరుమల బ్యాంకులకు దాదాపు రోజూ రూ.2.50 కోట్లు అందు బాటులోకి వస్తున్నాయి. ఇవిగాక బ్రేక్‌ దర్సనం టిక్కెట్ల విక్రయాలు, లడ్డూ ప్రసాదాల విక్రయాలు, గదులు అద్దె వంటి కలెక్షన్‌ కోట్లలో ఉంటుంది. ఈ నగదు కూడా స్థానిక బ్యాంకుల్లో రోజూ జమ అవుతుంది. అందుకే తిరుమల బ్యాంకుల్లో నగదుకు కొరత లేదు. తిరుమలలోని ఎటిఎంలలోనూ పుష్కలంగా డబ్బులున్నాయి. భక్తులకు ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతో ఎటిఎంలలో నిరంతరం డబ్బులు నింపుతున్నారు. తిరుమల బ్యాంకుల్లో ఖాతా ఉన్న వారు నగదు కోసం పెద్దగా ఇబ్బంది పడడం లేదు.
 
తిరుమల నుంచి వస్తున్న నగదును తిరుపతిలోనే ఆయా బ్యాంకుల ప్రధాన కార్యాలయాలకు తరలిస్తున్నారు. అక్కడి నుంచి నగరంలో ఉండే బ్రాంచీలకు పంపుతున్నారు. దీని వల్లనే తిరుపతి బ్యాంకులలో నగదు కొరత కొంతవరకైనా నివారించగలుగుతున్నారు. ఆర్‌బిఐ నుంచి వచ్చే డబ్బులను కోసం చూస్తూ కూర్చుంటే కళ్లు కాయలు కాసిపోయేవి. మొన్న ఒకేరోజు రూ.10 నోట్లే రూ.10 కోట్లకు ఒక బ్యాంకు తిరుపతికి పంపింది. నగదు రద్దయిన రెండో రోజూ తిరుమలలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి భక్తులు నగదు మార్చుకునే అవకాశం కల్పించారు. 
 
స్థానిక వ్యాపారులు కూడా తమ కుటుంబ సభ్యులు, దుకాణాలలో పనిచేసే సిబ్బంది ఆధార్‌ కార్డులు చూపించి పాతనోట్లే మార్చుకోగలిగారు. దీని వల్లే మొదటి వారంలో చూపించి కూడా తిరుమలలో చిల్లర సమస్య పెద్దగా లేకుండా పోయింది. ఏమైనా శ్రీనివాసుని వల్ల యాత్రికులతో పాటు స్థానికులకు కాస్త ఊరట దొరికింది.