బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By జె
Last Modified: శనివారం, 11 మే 2019 (17:02 IST)

కెసిఆర్‌కు ఏమైంది? ఉన్నట్లుండి కాంగ్రెస్ వైపు ఎందుకు మళ్లుతున్నారు?

యుపిఎ కూటమికి దగ్గర కావాలని సిఎం కెసిఆర్ భావిస్తున్నారా? కాంగ్రెస్ పార్టీతో సఖ్యతకు పావులు కదుపుతున్నారా? ఇందుకు కర్ణాటక సిఎం కుమారస్వామి ద్వారా రాయబారం నడుపుతున్నారా.? లోక్ సభ ఎన్నికల ఫలితాల తరువాత ఎన్డీయే మళ్ళీ అధికారంలోకి రాదన్న అంచనాలే ఇందుకు కారణమా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం ఇస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.
 
కెసీఆర్ చూపు కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్లిందంటున్నారు విశ్లేషకులు. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చే అవకాశం లేదని కెసిఆర్ భావిస్తున్నట్లు చెబుతున్నారు విశ్లేషకులు. లోక్ సభ ఎన్నికల ఫలితాలు వెలువడటానికి మరో పక్షం రోజుల సమయం మాత్రమే ఉంది. కాంగ్రెస్, బిజెపియేతర ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు గతంలోనే శ్రీకారం చుట్టిన కెసిఆర్ ఇటీవల మరోసారి ఫ్రంట్ దిశగా అడుగులు వేశారు. 
 
ఇందులో భాగంగానే కేరళ సిఎం విజయన్‌తో ఇప్పటికే బేటీ అయ్యారు. ఇదే సమయంలో ఆల్మట్టి నుంచి జూరాలకు నీటి విడుదలకు కర్ణాటక సిఎం కుమారస్వామితో కెసిఆర్ ఫోన్‌లో కూడా మాట్లాడారు. అప్పుడే జాతీయ రాజకీయాలపైన కూడా ఇద్దరి మధ్యా చర్చలు జరిగాయట. ఫెడరల్ ఫ్రంట్‌ను బలోపేతం చేసి కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యేందుకు జెడిఎస్‌తో కెసిఆర్ సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
 
తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీని తుడిచిపెట్టాలన్న ఉద్దేశంతో ఆ పార్టీలోని నేతలందరనీ దాదాపుగా టిఆర్ఎస్ లోకి తీసేసుకున్నారు కెసిఆర్. కెసిఆర్ సూచనలకు కుమారస్వామి కూడా ఒకే చెప్పినట్లు తెలుస్తోంది. తెలంగాణాలో టిఆర్ఎస్ గెలిచే లోక్ సభ సీట్లే కాకుండా ఎపిలో జగన్ గెలిచే సీట్ల విషయాన్ని కూడా కెసిఆర్ ప్రస్తావించారని సమాచారం. 
 
ప్రధానిగా మోడీ విఫలమయ్యారని, రాహుల్ రోజురోజుకు పరిణితి చెందుతున్నారంటూ లోక్ సభ ఎన్నికల సమయంలో కెసిఆర్ చెప్పడం వీరి మధ్య జరిగిన మాటలను బలపరుస్తున్నాయని చెబుతున్నారు. బిజెపితో పొత్తు పెట్టుకోవడం కంటే తక్కువ సీట్లు వచ్చే కాంగ్రెస్ పార్టీతోనే పొత్తు పెట్టుకోవడం మంచిదన్న అభిప్రాయంలో కెసిఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. 
 
ఈసారి ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే మిత్రపక్షాల సహకారం అవసరమని బిజెపి నేత రాంమాధవ్ స్వయంగా చెప్పారు. దీంతో కాంగ్రెస్ తోనే జతకట్టడం మంచిదన్న అభిప్రాయంలో కెసిఆర్ ఉన్నారట. ఇప్పటికే కెసిఆర్ స్టాలిన్, అఖిలేష్ యాదవ్, హేమంత్ సోరన్‌లను కలిశారు. వీరందరికీ కాంగ్రెస్ పార్టీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వారంతా ప్రధాని మోడీ వైఖరిని, బిజెపిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
 
ఒకవేళ లోక్ సభ సీట్లు బిజెపికి తక్కువగా వస్తే అప్పుడు కెసిఆర్ కాంగ్రెస్ పార్టీకే మద్దతివ్వడానికి సిద్ధంగా ఉన్నారట. తెలంగాణాకు చెందిన ఎంపి వినోద్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. దీంతో కెసిఆర్ దాదాపుగా కాంగ్రెస్ పార్టీకే మద్ధతు తెలపడం ఖాయమంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఏం జరుగుతుందో చూడాలి మరి.