గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By శ్రీ
Last Modified: గురువారం, 14 నవంబరు 2019 (22:32 IST)

క‌ర్నాట‌క పాలిటిక్స్: అప్పా, సిఎం యడియూరప్పా, మీ ప్లాన్ అదిరిందప్పా?

కర్ణాటక రాజకీయ పరిణామాలు చకచకగా మారిపోతున్నాయి. అనర్హత వేటుకు గురైన ఎమ్మెల్యేలకు ఉప ఎన్నికల్లో పోటే చేసే అవకాశం దక్కడంతో ... బీజేపీ దీన్ని ఉప ఎన్నికల్లో ప్రధాన అస్త్రంగా మార్చుకుని వారికే బంపర్ ఆఫర్ ప్రకటించింది. వారిలో 13 మందికి ఎన్నికల్లో పోటే చేసే అవకాశాన్ని అందించింది. అయితే... ఉపఎన్నికల్లో సత్తా చాటే రాజకీయ నేతల భవిష్యత్ పైన భారీ అంచనాలు నమోదు అవుతున్నాయి. 
 
కోర్టు తీర్పుతో ఫుల్ జోష్‌తో ఉన్న ఎమ్మెల్యేకు ఎలాగైనా.. ఈ ఉప ఎన్నికల్లో సత్తా చాటాలని వ్యూహాలకు పదును పెడుతున్నారు. కర్ణాటకలో ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధుల జాబితా వచ్చేసింది. అనూహ్యంగా బీజేపీలో చేరిన అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలకు మళ్లీ బీజేపీ అధిష్టానం వారిలో 13 మందికి అవకాశాన్ని అందించింది. ఈ నేపథ్యంలో బీజేపీ 13 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది. 
 
అనర్హత వేటు పడ్డ 17 మంది ఎమ్మెల్యేలను ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనుమతిస్తూ నిన్న సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది. అయితే వీటిలో రెండు సీట్లకు సంబంధించిన పిటిషన్లపై కర్ణాటక హైకోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఆ స్థానాల్లో ఈసీ ఎన్నికలు నిర్వహించడం లేదు. దీంతో ఉప ఎన్నికలు జరిగే 15 స్ధానాలకు గాను బీజేపీ 13 మందిని రంగంలోకి దింపుతోంది.
 
మరోవైపు దీనిపై స్పందించిన సిఎం యడియూరప్ప మాట్లాడుతూ ... అనర్హత వేటుకు గురైన రెబెల్‌ ఎమ్మెల్యేలు బీజేపీ అభ్యర్ధులుగా పోటీ చేస్తారని, వారిలో పలువురు కాబోయే మంత్రులని స్పష్టం చేశారు. డిసెంబర్‌ 5న జరిగే అసెంబ్లీ ఉప ఎన్నికల్లో వారిని బీజేపీ తమ పార్టీ అభ్యర్ధులుగా బరిలో నిలిపింది. జేడీఎస్‌, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు అనర్హులుగా స్పీకర్‌ ప్రకటించిన క్రమంలో ఆయా నియోజకవర్గాల్లో ఉప ఎన్నిక అనివార్యమైంది. 
 
ఇక జేడీఎస్‌, కాంగ్రెస్‌ రెబెల్స్‌ మహేష్‌ కుమతల్లి, శ్రీమంతగౌడ పాటిల్‌, రమేష్‌ జర్కిహోలి, శివరాం హెబ్బర్‌, బీసీ పాటిల్‌, ఆనంద్‌ సింగ్‌, కే సుధాకర్‌, భైరతి బసవరాజ్‌,  ఎస్‌టీ సోమశేఖర్‌, కే గోపాలయ్య, ఎంటీబీ నాగరాజ్‌, కేసీ నారాయణ గౌడ, హెచ్‌ విశ్వనాధ్‌లు ఈసారి బీజేపీ అభ్యర్ధులుగా పోటీ చేస్తున్నారు. 
 
కర్ణాటకలో అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేల్లో 13 మందిని భాజపా ఉప ఎన్నికల బరిలోకి నిలపడం కూడా బీజేపీ వ్యూహాల్లో భాగమేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 15 స్థానాలకు జరగబోయే ఉపఎన్నికల్లో కనీసం 6 స్థానాలు గెలుచుకుంటేనే భాజపాకు అధికారంలో కొనసాగే వీలుంటుంది. దీంతో ఆ పార్టీకి ఈ ఎన్నికలు కీలకం కానున్నాయి.