శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. దీపావళి
Written By సిహెచ్
Last Updated : గురువారం, 12 నవంబరు 2020 (16:52 IST)

దీపావళి... ఈ రోజు నీటిలోకి గంగ, నువ్వుల నూనెలోకి లక్ష్మీదేవి వస్తారట...

ఆశ్వయుజ బహుళ అమావాస్యను దీపావళి పర్వదినంగా దేశమంతటా ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. దసరా పండుగలాగే దీపావళి కూడా అధర్మంపై ధర్మం గెలుపొందినందుకు, దుష్టశిక్షణ, శిష్టరక్షణ జరిగినందుకు ఆనందంతో జరుపుకునే పర్వదినంగా పవిత్రతను సంతరించుకుంది. నరక చతుర్ధశి , దీపావళి అమావాస్య అంటూ రెండురోజులు పండగ జరుపుకోవటం సాంప్రదాయం. 

దుష్టుడైన నరకాసురుడిని సత్యభామ- శ్రీకృష్ణుడు ఇద్దరూ కలిసి సంహరించిన విజయాన్ని పురస్కరించుకొని దేశమంతటా అంగరంగ వైభవంగా ఈ పండుగను జరుపుకుంటారు. అన్ని మతాల వారు వయోభేదం లేకుండా బాణసంచా కాల్చి ఆనందిస్తారు. ఆశ్వయుజ మాసంలో కురిసిన వానల వల్ల దోమలు విపరీతంగా విజృంభిస్తుంటాయి. బాణసంచా కాల్చినప్పుడు వెలువడే పొగకు దోమలు నశిస్తాయి. దీపావళి పండుగ పర్వదినానికి ఆధ్యాత్మికమైన ప్రత్యేకతలు ఉన్నాయని మన పూర్వీకులు చెబుతుంటారు.
 
దీపావళి అమావాస్యనాడు గంగాదేవి అన్ని జలవనరులలో సూక్ష్మరూపంలో నిండి ఉంటుంది. సంవత్సరంలో ఈ ఒక్క రోజు మాత్రమే ఇండ్లలోకి వచ్చే నీళ్లలో కూడా గంగాదేవి నిండి ఉండటం వలన ఆ రోజు చేసే స్నానం గంగా స్నానంతో సమానమైనదిగా భావించబడుతుంది. ఎవరి ఇండ్లల్లో వాళ్లుంటూనే గంగాస్నాన ఫలాన్ని అనుగ్రహిస్తుంది దీపవళి పర్వదినం. ప్రతిఒక్కరూ సూర్యోదయానికి పూర్వమే లేచి స్నానాన్ని ఆచరించడం సదాచార విధి. దీపావళి రోజు నీళ్లలో గంగ నిండి ఉన్నట్లే, తైలం ముఖ్యంగా నువ్వుల నూనెలో లక్ష్మీదేవి సూక్ష్మరూపంలో నిండిఉంటుంది. 
 
అందుచేత ఆ నూనెతో శరీరానికి మర్ధించుకొని గంగా జలాలతో స్నానం చేయడం శుభకరంగా ఉంటుందని పురాణాలలో చెప్పబడింది. ఈ విధంగా తైలంతో అభ్యంగన స్నానం చేయడం వలన మహాలక్ష్మీ అనుగ్రహం సిద్ధిస్తుంది. దారిద్ర్యం పరిహరింపబడుతుంది. దీపావళినాడు చేసే అభ్యంగన స్నానానికి అంతటి మహత్యం ఉంది. దీపావళి నాడు మహాలక్ష్మిని పూజించడం కృతయుగం నాటి నుండి వస్తున్న సత్సంప్రదాయం. అందులోనూ మట్టి ప్రమిదలలో నువ్వుల నూనె పోసి, పత్తితో వత్తులు చేసి, వాటిలో వేసి వెలిగించడం వలన ఆ దీపాలలో మహాలక్ష్మీ అంశ నిండిపోతుంది. మాములు ప్రమిదలలో వెలిగే జ్యోతులు దీపలక్ష్మికి సంకేతాలుగా పూజింపబడటం దీపావళి పండుగ ప్రత్యేకత.
 
దీపం వెలుగుకు, జ్ఞానానికి ప్రతీక. అమావాస్య చీకట్లను పారద్రోలూతూ ఇండ్ల ముందు, పూజాగృహంలో వెలిగే దీపాల వరుసలు సర్వశుభాలు అనుగ్రహిస్తాయి. "దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం జ్యోతి పరాయణం!, దీపేన హరతే పాపం, సంధ్యా దీపం నమోస్తుతే!" అంటూ దీపానికి నమస్కరించి, లక్ష్మీదేవి స్వరూపంగా దీపాన్ని పూజించి మహాలక్ష్మి పటానికి గానీ, విగ్రహానికి గానీ షోడశోపచారాలతో పూజ చేయాలి. పంచభూతాల్లో ప్రధానమైంది అగ్ని. ప్రాణికోటి మనుగడకు ఉపకరించే తేజస్సును, ఆహారాన్ని ఐహికంగానూ, విజ్ఞాన ధర్మ గరిమను ఆధ్యాత్మికంగాను అగ్ని ప్రసాదిస్తుంది. 
 
దీపాన్ని వెలిగిస్తే.. నీలం, పసుపు, తెలుపు వర్ణాలు కనిపిస్తాయి. ఇవి మానవ మనుగడకు అవశ్యకమైన సత్వరజస్తమోగుణాల సమ్మేళనంగా ఆర్యులు పేర్కొన్నారు. ఈ మూడు రంగులను జగతిని పాలించే లక్ష్మి, సరస్వతి, దుర్గలుగా, సత్యం, శివం, సుందరంగా, త్రిజగన్మాతలుగా, మానవులకు విజ్ఞానం, వివేకం, వినయాలకు సంకేతంగా అభివర్ణిస్తారు. పగలు నిత్య పూజ చేసినా సాయంత్రం సూర్యాస్తమయానంతరం మహాలక్ష్మి పూజ సంకల్పయుక్తంగా, విధివిధానంగా జరిపించాలి.