శుక్రవారం, 27 జూన్ 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. పండుగలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 26 జూన్ 2025 (19:16 IST)

పూరీ జగన్నాథుడు అద్భుత విశేషాలు, ఆలయం పైన విమానం ఎగిరితే?

Lord Jagannath of Puri
భారతదేశంలోని ఒడిషా రాష్ట్రంలో బంగాళాఖాతం తీరాన ఉన్న పూరీ పట్టణంలో జగన్నాథుడు కొలువై ఉన్నాడు. ఒడిషా రాజధాని అయిన భువనేశ్వర్ నుండి ఊరికి సుమారు 65 కిలోమీటర్ల దూరం ఉంటుంది. “పురుషోత్తమ క్షేత్రం”, “శ్రీక్షేత్రం” అనే పేర్లతో కూడా పిలువబడే పూరీ, భారతదేశంలోని నాలుగు సుప్రసిద్ధ హిందూ పుణ్యక్షేత్రాలైన బద్రీనాథ్, ద్వారక, పూరీ, రామేశ్వరంలను కలిపి పిలువబడే చార్‌ ధామ్‌లలో ఒక పుణ్య క్షేత్రం. ఆదిశంకరాచార్యులచే సృజించబడిన ఈ క్షేత్రాలలో మూడు వైష్ణవ క్షేత్రాలు, ఒక శైవ క్షేత్రము ఉన్నాయి. అయితే కాలక్రమేణా చార్‌ ధామ్‌ అనే పదము హిమాలయాలలోని యమునోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్ క్షేత్రాలకు ఆపాదించబడింది.
 
జగన్నాధుడు ఎవరు?
జగన్నాధుడు అన్న పదానికి అర్థం జగత్తుకు నాధుడు అనగా ఈ విశ్వానికి ప్రభువు అని అర్ధం వస్తుంది. జగన్నాధుడిని విశ్వమునకు భగవానుడిగా భావిస్తారు. విష్ణువు అనగా అంతటా వ్యాపించి ఉన్నవాడు. విశ్వమంతా వ్యాపించి ప్రభువై పాలిస్తున్న దేవుడే జగన్నాధుడు. స్కంధ పురాణం ప్రకారం శ్రీహరి తన దైవిక వాగ్దానాన్ని నెరవేర్చడానికి పూరీలో వెలసి రధయాత్రలో పాల్గొంటున్నాడని ఇతిహాసములు తెలియజేస్తున్నాయి. సాధారణంగా ఏ దేవాలయంలోనైనా దేవుడు సతీసమేతంగా కొలువుతీరి వుంటాడు. కానీ పూరీ క్షేత్రంలోని జగన్నాథుడు మాత్రం తన సోదరుడు 'బలభద్రుడు' తోనూ, సోదరి 'సుభద్ర'తోనూ, కొలువుతీరి సేవలు అందుకొంటూ వుంటాడు. 
 
నిర్మాణం:
రాజవంశానికి చెందిన రాగి శాసనాల ప్రకారం, ప్రస్తుతమున్న జగన్నాథ ఆలయాన్ని కళింగ పరిపాలకుడైన అనంతవర్మ చోడగంగాదేవ ప్రారంభించాడు. ఈ ఆలయంలోని జగన్మోహన, విమాన భాగాలు అతని హయాం(సా.శ.1078 - 1148)లోనే నిర్మింపబడ్డాయి. కాని సా.శ. 1174లో ఒడిషా పాలకుడైన అనంగ భీమదేవ దీన్ని పునర్నిర్మించి ఈ ఆలయానికి ప్రస్తుతమున్న రూపునిచ్చాడు.
 
ఈ భారీ ఆలయ భవనం 400,000 చదరపు అడుగులు కన్నా ఎక్కువ వైశాల్యంతో ప్రహరీగా చుట్టూ ఎత్తైన కోటగోడలను కలిగి ఉంటుంది. ఆలయం కళింగ శైలిలో నిర్మించబడింది, ఇది భారతదేశంలోని ఇతర ఆలయాలకంటే భిన్నమైన నిర్మాణ శైలిని కలిగి ఉంది, ఆలయం ఎత్తు 214 అడుగులు. ఇందులో కనీసం 120 గుళ్ళూ, పూజా స్థలాలు ఉన్నాయి. అమోఘమైన శిల్ప సంపదను కలిగిన ఈ ఆలయం, భారత అద్భుత కట్టడాలలో ఇది ఒకటిగా నిలిచింది.
 
ఆలయంలో కొలువుదీరిన మూర్తుల విశేషాలు:
గర్భగుడిలో జగన్నాథ్, బలభద్ర, సుభద్రల మూలవిరాట్టులు రాత్నవేది అనే ఆభరణాలతో అలంకరించిన దిమ్మెపై కొలువు తీరి ఉంటారు. వీటితో పాటే సుదర్శన చక్ర, మదనమోహన, శ్రీదేవి, విశ్వధాత్రిల విగ్రహాలు కూడా రాత్నవేదిపై ఉంటాయి. జగన్నాథ, బలభద్ర, సుభద్ర, సుదర్శన చక్రాల విగ్రహాలు దారు బ్రహ్మగా పిలిచే పవిత్రమైన వేప కాండాల నుంచి తయారు చేయబడతాయి. కాలాలను బట్టి ప్రతిమల నగలు, దుస్తులను మార్పు చేస్తుంటారు.
 
పూరి జగన్నాథ ఆలయంలో అత్యంత గోప్యమైన, పవిత్రమైన సాంప్రదాయం 12 నుండి 19 సంవత్సరాల మధ్య విగ్రహాలను మార్చడం. నవకళేవర అనిపిలవబడే దేవతల చెక్క విగ్రహాలను మార్చే వేడుక అతి ప్రాచీన కాలం నుండి కొనసాగుతున్న ఆచారం. ఈ వేడుక కోసం ఒక రహస్య ప్రాంతం నుండి పవిత్రమైన వేప చెట్టును ఎంచుకుంటారు. విగ్రహాలను బ్రహ్మ పరివర్తన్ అని పిలవబడే దైవత్వాన్ని పాత చెక్క విగ్రహాలనుండి కొత్త విగ్రహాలలోనికి బదిలీ చేసే వేడుక ఆలయ ప్రాంగణంలో అతి రహస్యంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రక్రియ ఇప్పటికీ బాగా రహస్యంగా ఉంచబడుతుంది. దైవత్వం మార్పును గమనించిన వ్యక్తులు ఒక సంవత్సరం లోపు మరణిస్తారంటారు.
 
Lord Jagannath of Puri
ఆలయంలోని విగ్రహాలు అసంపూర్ణంగా చెక్కబడి ఉండటానికి కారణం:
ఇంద్రద్యుమ్నుడు అనే రాజు, నీలాచలం మీద ఓ ఆలయాన్ని నిర్మించి నరసింహస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాడు. ఒకనాడు ఆయన అక్కడే నిద్రిస్తుండగా, జగన్నాథుడు కలలో కనిపించి సముద్రతీరంలో చాంకీనది ముఖద్వారానికి వేప కొయ్యలు కొట్టుకొస్తాయనీ, వాటితో విగ్రహాలు చేయించమని  ఆదేశిస్తాడు. కొయ్యలైతే కొట్టుకొచ్చాయి కానీ, విగ్రహ నిర్మాణానికి ఎవరూ ముందుకు రాలేదు. ఏం చేయాలా అని రాజు ఆలోచిస్తున్న సమయంలో దేవశిల్పి విశ్వకర్మ వికలాంగుడి రూపంలో వచ్చి, తానొక్కడినే రహస్యంగా ఓ గదిలో విగ్రహాలకు రూపకల్పన చేస్తాననీ, ఆ సమయంలో పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోననీ, విగ్రహాలు రూపొందించడానికి 21 రోజులు పడుతుందని, విగ్రహాలు తయారయ్యే వరకు అటువైపు ఎవరూ రాకూడదనీ, తన పనికి ఆటంకం కలగకూడదనీ షరతు విధిస్తాడు. దానికి రాజు అంగీకరిస్తాడు.
 
రోజులు గడుస్తున్నా గదిలోనుండి ఎలాంటి శబ్దమూ రాకపోవవటంతో రాణి గుండిచాదేవి గాబరా పడి తొందర పెట్టడంతో గడువు పూర్తవకుండానే రాజు తలుపులు తెరిపించాడు. తలుపులు తెరిచి చూడగా శిల్పి కనిపించడు, చేతులూ కాళ్లూ లేని, సగం చెక్కిన విగ్రహాలు మాత్రం దర్శనమిస్తాయి. పశ్చాత్తాపంతో రాజు బ్రహ్మదేవుడిని ప్రార్థిoచగా చతుర్ముఖుడు ప్రత్యక్షమై ఇకమీదట అదేరూపంలో విగ్రహాలకు పూజలు చేయమని ఆనతిచ్చి, తానే స్వయంగా వాటికి ప్రాణప్రతిష్ఠ చేశాడు. పూరీ ఆలయంలోని విగ్రహాలకు అభయహస్తం, వరదహస్తం అందుకే కనిపించనవని అంటారు. చతుర్దశ భువనాలనూ వీక్షించడానికా అన్నట్టు ఇంతింత కళ్లు మాత్రం ఉంటాయి.
 
ఆలయం యొక్క అద్భుతాలు:
1. ప్రకృతి ప్రవర్తనా నియమావళిని ధిక్కరించడం
ఏ వస్త్రం అయినా గాలి గమనం దిశలో ఎగురుతుంది. కానీ జగన్నాథ ఆలయం పైభాగంలో అమర్చబడిన పతాకము ఈ సూత్రానికి ఒక ప్రత్యేకమైన మినహాయింపు. ఈ ప్రత్యేకమైన పతాకము గాలి గమనానికి వ్యతిరేక దిశలో ఎగురుతుంది. దీనికీ గల కారణాలు శాస్తజ్ఞ్రులకు ఇంతవరకు అంతుబట్టలేదు.
 
Lord Jagannath of Puri Temple
2. ఎటువంటి పరికరాలు లేకుండా ఆలయాన్ని ఎక్కడం
45 అంతస్తుల భవనం ఎత్తుకు సమానమైన ఎత్తు కలిగిన ఈ ఆలయ గోపురంపై ఉన్న జెండాను మార్చడానికి ప్రతిరోజూ ఒక పూజారి గోడలను ఎటువంటి పరికరాలు ఉపయోగించకుండా త్వరిత గతిన సునాయాసంగా ఎక్కుతాడు. ఈ ఆచారం ఆలయం నిర్మించిన కాలం నుండి కొనసాగుతోంది. పూజారి ఎటువంటి రక్షణ పరికరాలు లేకుండా కేవలం చేతులతో పాకుతూ ఎక్కుతాడు.
 
3. నీడ పడని ఆలయం:
ఈ ఆలయంలో ఏమూలా, ఏ సమయములోను ఆలయము యొక్క నీడపడదు. ఇది ఇక్కడి అద్భుతమైన నిర్మాణ నైపుణ్యాన్ని ప్రతిబింబిస్తుంది.
 
4. నీలచక్రం యొక్క ప్రత్యేకత:
ఆలయం శిఖరంపై కనిపించే చక్రానికి "నీలచక్రం" అని పిలుస్తారు. 214 అడుగులు ఎత్తుపై ఉన్న గోపురంపై తొమ్మిది వందల కిలోలకు పైగా బరువు 11 అడుగుల ఉన్న నీల చక్రాన్ని 11 వ శతాబ్దంలో అమర్చడం ఒక అద్భుతమైతే, ఆ చక్రాన్ని ఎటువైపు నుండి చూసినా తమవైపే తిరిగి ఉన్నట్లు కనిపించడం ఇంకొక అద్భుతం.
 
5. ఆలయంపై ఎటువంటి పక్షీ ఎగరదు:
ఆలయం పైనున్న ఈ ప్రత్యేక ప్రాంతం పక్షులు ఎగరడానికి నిషేధింపబడిందా అన్నట్లు ఆలయ గోపురం పైన ఒక్క పక్షి కూడా కనిపించదు, ఆలయం పైన ఎగురుతున్న విమానం కూడా కనిపించదు.
 
6. సింహద్వారం లోపల సముద్రపు అలలు వినబడకపోవడం
సింహ ద్వార ప్రవేశ ద్వారం నుండి ఆలయం లోపలికి మొదటి అడుగు వేసిన తర్వాత, సముద్రపు అలల శబ్దాలు అస్సలు వినబడవు. సాయంత్రం సమయంలో ఈ వింత మరింత ప్రముఖంగా తెలుస్తుంది. మళ్ళీ, సింహ ద్వారం దాటి బయటకు వచ్చిన వెంటనే సముద్రపు అలల శబ్దం ప్రస్పుటంగా వినిపిస్తోంది. ఈ వాస్తవాన్ని నిరూపించడానికి ఎటువంటి శాస్త్రీయ ప్రామాణికత కనుగొనబడలేదు. స్థానికపురాణాల ప్రకారం, ఆలయ ద్వారాల లోపల ప్రశాంతతను కోరుకునే ఇద్దరు ప్రభువుల సోదరి సుభద్ర యొక్క సంకల్పం అని చెబుతారు.
 
7. సముద్రపు గాలి వీచుటలోనూ ప్రత్యేకత:
భూమిపై ఏ ప్రదేశాన్ని తీసుకున్నా, పగటిపూట సముద్రం నుండి గాలి భూమికి వస్తుంది. సాయంత్రం దానికి విరుద్ధంగా ఉంటుంది. కానీ, పూరీలో, గాలి  ప్రవర్తన విరుద్ధంగా ఉంటుంది. పగటిపూట, గాలి భూమి నుండి సముద్రం వైపు వీస్తుంది, సాయంత్రం దానికి విరుద్ధంగా వీస్తుంది.
 
8. వంట చేయడానికి అమోఘమైన పద్దతి:
ఇక్కడి పూజారులు సాంప్రదాయ పద్ధతిలో ప్రసాదం వండుతారు. సరిగ్గా ఏడు మట్టి పాత్రలను ఒకదానిపై ఒకటి అమర్చి కట్టెలను ఉపయోగించి వండుతారు. మంత్రముగ్ధులను చేస్తూ, పైభాగంలోని కుండను ముందుగా వండుతారు, మిగిలినవి అదే రీతిగా ఉడుకుతాయి.
 
ఆలయంలో జరిగే ముఖ్యమైన పండుగలు:
1. రథయాత్ర:
ఇది ఆషాఢ మాసంలో జరిగే వార్షిక ఉత్సవం. ఇందులో మూడు ప్రధాన విగ్రహాలు మూడు పెద్ద రథాలపై ఊరేగింపుగా తీసుకెళతారు. 
 
2. చందనయాత్ర:
ఇది వైశాఖలో అక్షయ తృతీయ నాడు ప్రారంభించబడి జ్యేష్ఠ మాసంలో కొనసాగే 42 రోజుల పాటు జరిగే పండుగ. ఇందులో జగన్నాథుడు, ఇతర దేవతల విగ్రహాలకు చందనం పూస్తారు.
 
3. స్నానయాత్ర:
ఇది జ్యేష్ఠ పూర్ణిమ రోజున జరిగే పవిత్ర స్నాన ఉత్సవం. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర విగ్రహాలకు ప్రత్యేక స్నానం చేయిస్తారు.
 
4. డోలాపూర్ణిమ:
ఇది ఫాల్గుణ మాసంలో జరిగే పండుగ. జగన్నాథుడు, ఇతర దేవతలూ ఊయలపై ఊగుతూ భక్తులకు దర్శనమిస్తారు.
 
5. నవకాలేబరా:
ఇది జగన్నాథుని కొత్త విగ్రహాలను ప్రతిష్టించే ఉత్సవం. ఇది 12 లేదా 19 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది.
 
- కొమ్మోజు వెంకట రాజు