1. వార్తలు
  2. బిజినెస్
  3. కథనాలు
Written By pnr
Last Updated : గురువారం, 24 నవంబరు 2016 (12:17 IST)

ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ ఏమయ్యారు?... అన్నీతానై సాగుతున్న ప్రధాని మోడీ

దేశ వ్యాప్తంగా కరెన్సీ కష్టాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. దేశంలో పెద్ద నోట్ల రద్దు తర్వాత పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ఒక విధంగా చెప్పాలంటే ప్రపంచంలోనే అతిపెద్ద నగదు సంక్షోభం దిశగా భారత్ పయనిస్త

దేశ వ్యాప్తంగా కరెన్సీ కష్టాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. దేశంలో పెద్ద నోట్ల రద్దు తర్వాత పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ఒక విధంగా చెప్పాలంటే ప్రపంచంలోనే అతిపెద్ద నగదు సంక్షోభం దిశగా భారత్ పయనిస్తోంది. అలాంటి పరిస్థితుల్లో కేంద్ర బ్యాంకు అధికారిగా అనుక్షణం పరిస్థితిని సమీక్షిస్తూ, ప్రజలకు ఊరట కలిగించాల్సిన ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ కనిపించకపోవడాన్ని పలువురు విమర్శిస్తున్నారు. 
 
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్‌గా ఉన్న ఉర్జిత్, ప్రజల్లోకి రాకపోవడంపై ఇప్పుడు ప్రశ్నలు సంధిస్తున్నారు. ఈ నెల 8వ తేదీన మోడీ నోట్ల రద్దు అంశాన్ని ప్రకటించి, చలామణిలోని 86 శాతం కరెన్సీ రద్దయిందని ప్రకటించిన తర్వాత ఉర్జిత్ పటేల్, ఒకే ఒక్కసారి మీడియా ముందుకు వచ్చారు. నగదు కొరత ఏర్పడి, దేశంలో గొడవలు జరగవచ్చని సుప్రీంకోర్టు హెచ్చరించినా కూడా ఉర్జిత్ తన అభిప్రాయాన్ని చెప్పలేదు. పటేల్ రాజీనామా చేయాలని బ్యాంకర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసినప్పటికీ, ఆయన పెదవి విప్పడం లేదు కదా... కనీసం కనిపించడం కూడా లేదు. 
 
అత్యంత కీలకమైన నగదు రద్దు విషయంలో ఎంతో ముందస్తుతో ప్రణాళికలు రూపొందించాల్సిన ఉర్జిత్ పటేల్, ఈ విషయంలో పూర్తిగా విఫలమయ్యారనే విమర్శలు వస్తున్నాయి. ఇదే అభిప్రాయాన్ని న్యూయార్క్ ఫెడరల్ రిజర్వ్ సలహాదారు, కార్నెల్ యూనివర్శిటీలో పరపతి చట్టాలను బోధించే రాబర్ట్ హాకెట్ కూడా అభిప్రాయపడ్డారు. ప్రజలకు కొంత సమయం ఇవ్వాల్సి వుందని ఆయన అన్నారు. రద్దుకు ముందే చాలినన్ని కొత్త నోట్లను ఉంచుకోవాల్సి వుందని తెలిపారు.