శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. స్వాతంత్ర్య దినోత్సవం
  3. స్వాతంత్ర్య సమరయోధులు
Written By pnr
Last Updated : శుక్రవారం, 11 ఆగస్టు 2017 (14:52 IST)

'పత్తి'(పింగళి)వెంకయ్య.. జాతీయ జెండాను ఎందుకు రూపొందించారంటే...

భారతదేశానికి గౌరవ చిహ్నమైన జాతీయ జెండాను రూపొందించిన స్వాతంత్ర్య సమరయోధుడు పింగళి వెంకయ్య. ఈయనకు మరోపేరు పత్తి వెంకయ్య. ఇలా పిలవడానికి ఓ కారణం ఎలా ఉంది. అలాగే, జాతీయ జెండాను రూపొందించడానికీ అంకంటే బలమ

భారతదేశానికి గౌరవ చిహ్నమైన జాతీయ జెండాను రూపొందించిన స్వాతంత్ర్య సమరయోధుడు పింగళి వెంకయ్య. ఈయనకు మరోపేరు పత్తి వెంకయ్య. ఇలా పిలవడానికి ఓ కారణం ఉంది. అలాగే, జాతీయ జెండాను రూపొందించడానికీ అంకంటే బలమైన కారణం ఉంది. 
 
భారత స్వాతంత్ర్య ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న వెంకయ్య మంచి ఉపన్యాసకుడిగా, వ్యవసాయ క్షేత్రాభివృద్ధికి తోడ్పడిన మహోన్నత వ్యక్తిగా ఖ్యాతిగడించారు. వెంకయ్య బహుభాషాకోవిదుడు. తెలుగు, తమిళం, ఆంగ్లంతో పాటు జపనీస్, సంస్కృతం, ఉర్దూ భాషల్లో అనర్గళంగా మాట్లాడగల మంచి వక్త. 
 
స్వదేశంలో ప్రాథమిక విద్యను పూర్తి చేసిన ఆయన ఉన్నత విద్య కోసం 19వ యేటనే దక్షిణాఫ్రికా వెళ్ళిన వెంకయ్యకు అక్కడ మహాత్మా గాంధీజీతో పరిచయం ఏర్పడింది. ఆ సమయంలో అక్కడి బోయర్ ఉద్యమంలో ఇద్దరూ కలిసి పాల్గొన్నారు. భారత్‌కు తిరిగి వచ్చి కొంతకాలం మద్రాసులో ప్లేగు వ్యాధి నిరోధక అధికారిగా పనిచేశారు. అర్థశాస్త్రం చదివేందుకు మళ్ళీ కొలంబో వెళ్ళారు.
 
కొలంబో నుంచి తిరిగొచ్చాక రాజా నాయని రంగారావు బహదూర్‌ కోరికపై వెంకయ్య కొంతకాలం మునగాల ఎస్టేట్‌లో పనిచేశారు. ఈ సమయంలోనే కాంబోడియా పత్తిపై విశేష పరిశోధన చేశారు. ఈ పరిశోధనను అప్పటి బ్రిటీష్‌ ప్రభుత్వం గుర్తించడంతో ఆయన్ని 'పత్తి వెంకయ్య'గా పిలిచేవారు. తదనంతరం ఆంధ్ర జాతీయ కళాశాల అధ్యాపకునిగా పని చేయడమే కాకుండా, విద్యార్థులకు వ్యవసాయ రంగంలో మెళకువలు నేర్పించారు. పరిశోధనలూ చేయించారు. 
 
అయితే, మనదేశం తెల్లదొరల పాలనలో ఉన్న సమయంలో దేశంలోని వివిధ కార్యాలయాలపై బ్రిటీష్‌ దేశ యూనియన్‌ జాక్‌ జెండాలు ఎగురవేస్తుండేవారు. ఇది వెంకయ్యను మనోవేదనకు గురిచేసింది. దీంతో ఆయన భారత జాతీయ పతాక రూపొందించేందుకు శ్రీకారం చుట్టారు. అలా జాతీయ జెండా పింగళి వెంకయ్య చేతుల మీదుగా రూపుదిద్దుకుంది. అందుకే జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య భారతీయులకు మరీ ముఖ్యంగా తెలుగు వారికి ఎప్పటికీ చిరస్మరణీయులు మిగిలిపోతారు. 
 
ఈయన 140వ జయంతి వేడుకలు ఆగస్టు 2వ తేదీన జరుపుకున్నారు. 1876, ఆగస్టు 2వ తేదీన జన్మించిన పింగళి వెంకయ్య.. బ్రిటీష్ ఇండియన్ ఆర్మీలో చేరి సేవలు అందించారు. ఫలితంగా దక్షిణాఫ్రికాలో జరిగిన ఆంగ్లో - బోయర్ యుద్ధంలో పాల్గొన్నారు. ఆ యుద్ధ సమయంలో గాంధీతో ఏర్పడిన పరిచయం సుమారు 50 యేళ్లకు పైగా కొనసాగింది. 
 
అనంతరం 1921 మార్చి 31వ తేదీన కాకినాడలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశం జరిగింది. ఇందులో జాతీయ పతాకాన్ని రూపొందించే గురుతర బాధ్యతను పింగళికి మహాత్మా గాంధీ అప్పగించారు. ఈ జెండా కాషాయం, ఆకుపచ్చ మధ్యలో తెలుపు రంగు ఉండాలని గాంధీ సూచించారు. ఈజెండా మధ్యభాగంలో ఉన్న ధర్మచక్ర (వీల్ ఆఫ్ లా) రూపకల్పనలో ఆర్య సమాజ్ ఉద్యమ వ్యవస్థాపకుడు లాలా హాన్స్‌రాజ్ తన వంతు సహకారం అందించారు. అలా త్రివర్ణ పతాకం రూపుదిద్దుకుంది.