1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By pyr
Last Updated : గురువారం, 19 మార్చి 2015 (14:17 IST)

ఆయుర్వేద మందులు వేడి చేస్తాయా..? ఎండాకాలం వాడకూడదా..!?

చాలా మందిలో ఒక అనుమానం ఉంది... ఇది ఎక్కడ నుంచి పుట్టిందో తెలియదుగానీ, ఆయుర్వేద మందులు శరీరానికి వేడి చేస్తాయని అంటుంటారు. పిల్లలకైతే అసలు ఇవ్వకూడదని అంటుంటారు. ఇది నిజమా...? ఆయుర్వేద మందులు వేడి చేస్తాయా..? ఎండాకాలంలో అసలు తీసుకోకూడదా..? చిన్నపిల్లలకు ఇవ్వకూడదా..? మరి ఆంగ్లేయ మందులు రాకమునుపు మన పూర్వీకులు ఏమి చేసేవారు? రండీ.. తెలుసుకుందాం. 
 
చెట్టూ పుట్టా.. మనిషీ.. పశువూ ఏదైనా అక్కడి పరిస్థితులకు అనుగుణంగానే ఉంటాయి. అదే విధంగా ఔషధ మొక్కలు కూడా దేశాలను అనుసరించి అక్కడి మనుషులకు అనుగుణంగానే ఉంటాయి. ఆకుకూరలు, దుంపలు, కాయలు, పండ్లు, ఇవన్నీ మేలు చేస్తే.. ఓషధ మొక్కలు ఎందుకు కీడు చేస్తాయి.? అవి కూడా ఖచ్చితంగా మేలే చేస్తాయని ఆయుర్వేద నిపుణులు చెపుతున్నారు. అయితే వాటిని తీసుకుని విధానం.. సమయం, సందర్భం మీద ఆధారపడి ఉంటుందని చెపుతున్నారు. 
 
ఇష్టానుసారం తీసుకుంటే ఇంగ్లీషు మందులు కూడా వికటిస్తాయి. ఆయుర్వేద మందులు పద్దతి ప్రకారం తీసుకుంటే ఎవరికీ వేడి చేయదు. ఉదాహరణకి తేనె తీసుకుందాం. తేనేను తీసుకుంటే వేడి చేస్తుందని భావిస్తారు. ఇక్కడ ఒక్కటి గమనించాల్సిన అవసరం ఉంది. తేనె జీర్ణాశయంలోకి వెళ్లి జీర్ణం కావాల్సిన పనిలేదు. అది నేరుగా రక్తంలో కలిసిపోతుంది. ఇక్కడ ఏం జరుగుతుంది? తేనె రక్తం కంటే ఎక్కవ చిక్కగా ఉంటుంది. దీనివలన అది కరిగిపోవడానికి శరీరంలోని నీటిని వినియోగించుకుంటుంది. 
 
అలాంటి సమయంలో శరీరంలో సహజంగానే నీటి శాతం తగ్గుతుంది. ఫలితంగా దప్పిక వేస్తుంది. దీనిని మనం వేడి పుడుతుందని అనుకుంటాం. కానీ అదే తేనెను కావలిసినంత నీటితో కలిపి తీసుకుంటే వేడి అనే మాటే ఉండదు. ఇలాగే అన్ని ఆయుర్వేద మందులు కూడా ఉంటాయి. వేడి అవుతుందనే మాటే ఉండదు. కాకపోతే అది తీసుకునే విధానం మీద ఆధారపడి ఉంటుంది. తగిన విధానంలో వాడితే ఏ కాలంలోనైనా నిర్భయంగా ఎప్పుడైనా ఎక్కడైనా వినియోగించవచ్చు.