శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By chitra
Last Updated : గురువారం, 19 మే 2016 (16:26 IST)

సౌందర్య సాధనంగా కీరదోస.. వేసవిలో ఐస్ ప్యాక్ ఎందుకు?

చర్మంపై ఎండ ప్రభావం వల్ల ముఖం, కళ్లు జీవం కోల్పోయి నిర్జీవంగా కనిపిస్తుంది. కళ్ల వాపు, కంటి చుట్టూ నల్లని వలయాలూ, ముఖంలో తాజాదనం లేకపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఇలాంటి వాటిని తగ్గించుకోవడానికి కొన్ని చిట్కాలు..
 
కీరదోస గుజ్జులో కొద్దిగా నిమ్మరసం, తేనె కలపాలి. తర్వాత ఐస్‌ ట్రేలో వేసి ఫ్రీజర్‌లో ఉంచేయాలి. ఈ మిశ్రమం ఐసుముక్కల్లా అయ్యాక ముఖం, మెడకూ రాసుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత కడిగేసుకుంటే చాలు. ఇది మురికిని తొలగించి, ముఖాన్ని శుభ్రపరుస్తుంది. చర్మం కొత్త నిగారింపును సంతరించుకుంటుంది.
 
చర్మాన్ని సంరక్షించే ఎన్నో రకాల ఔషధ గుణాలు కీరదోసకాయల్లో ఉన్నాయి. అందుకే వీటిని సౌందర్య సాధనంగానూ అనేక చోట్ల వాడుతున్నారు. వీటిలో ఉండే పొటాషియం, మెగ్నీషియం, సిలికాన్ చర్మానికి మేలు చేస్తాయి. 
 
గులాబీ రేకులని నీటిలో వేసి వేడిచేయాలి. ఇది చల్లారిన తర్వాత కీరదోస రసం కలపాలి. ఈ మిశ్రమాన్ని ఐస్‌ట్రేలో వేసుకోవాలి. తర్వాత ఆ ఐస్ ముక్కలను కళ్లపై పెట్టుకోవాలి. ఇలా తరచూ చేయడం వల్ల కళ్ల అడుగున వలయాలు దూరం కావడమే కాదు, ఉబ్బిన కళ్ల సమస్య కూడా తగ్గుతుంది. 
 
శరీరంలో ఏర్పడే వేడిని కీరదోసకాయ తగ్గిస్తుంది. ఛాతిలో మంట కూడా తగ్గుతుంది. కీరదోసను చర్మంపై రుద్దితే సన్‌బర్న్ వంటి వాటి నుంచి ఉపశమనం లభిస్తుంది. మనకు నిత్యం కావల్సిన అనేక విటమిన్లు, పోషక పదార్థాలను కీరదోస కాయ అందిస్తుంది. విటమిన్ ఎ, బి లతోపాటు విటమిన్ సి కూడా దీంట్లో ఎక్కువగానే ఉంటుంది. ఇవన్నీ వ్యాధి నిరోధక వ్యవస్థను పటిష్టం చేయడానికి ఉపయోగపడతాయి.