హోటల్ తిండికి అలవాటు పడ్డారా? తస్మాత్ జాగ్రత్త!
ఇంటి తిండి అంటే అలుసా? హోటల్ తిండికి అలవాటు పడ్డారా? అయితే జాగ్రత్త సుమా. హోటల్లో తెల్లటి ఇడ్లీ, తెల్లటి అన్నం, దోసెలు, పూరీలు, చపాతీలు, పరోటాలను వెంట వెంటనే ఆర్డర్ చేసే వారు మీరైతే కాస్త ఆగండి. ఇంకా హోటల్లో తయారు చేసే విధానం గురించి తెలుసుకుంటే ఇక హోటల్ ఫుడ్డా వద్దు బాబోయ్ అంటూ పరిగెత్తక మానరు.
తెల్లటి ఇడ్లీ కోసం హోటల్స్లో ఉపయోగించే సోడా, ఈస్ట్ వంటివి అనారోగ్యాలకు దారితీస్తాయి. ఇడ్లీలో మిగిలిన అన్నాన్ని కలపడం ద్వారా మధుమేహ వ్యాధిగ్రస్థులకు, పిల్లలకు ఏమాత్రం మంచిది కాదు. గోధుమలు, బియ్యం వంటి వాటిని శుభ్రం చేయకుండా పొట్టుతో పాటు పిండి కొట్టేయడం ద్వారా లేనిపోని అనారోగ్య సమస్యలు తప్పవు. ఇంకా దోసెలు పల్చగా ఉండేందుకు పిండిలో చక్కెర, సున్ని పిండి, మైదా చేర్చుతున్నారు.
హోటల్ ఫుడ్లో కలిపే కలరింగ్ ఏజెంట్స్ ద్వారా చర్మ, పేగు, ఆస్తమా వంటి రోగాలు ఏర్పడటమే గాకుండా వ్యాధినిరోధక శక్తి, ఎముకలు బలహీనమవుతాయి. హోటల్ ఫుడ్లో ఇంట్లో కంటే అధికంగా ఉప్పును చేర్చుతారు. ఇది రక్తపోటు, గుండెపోటు, పక్షవాతం వంటి రోగాలు తప్పవు. వాడిన నూనెలను మళ్లీ మళ్లీ వాడటం ద్వారా ఒబిసిటీ తప్పదంటున్నారు వైద్యులు.
ఇంకా హోటల్ ఫుడ్లో చక్కర శాతం అధికంగా ఉంటుంది. జ్యూస్, ఐస్క్రీమ్లను ఎక్కువగా తీసుకోకూడదు. అందుచేత హోటల్ ఫుడ్ తీసుకునేటప్పడు ఒకటికి నాలుగుసార్లు ఆలోచించండి. తప్పని పక్షంలో క్వాలిటీ విషయంలో రాజీపడకండని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.