మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. హిందూ
Written By Selvi
Last Updated : గురువారం, 15 జూన్ 2017 (14:53 IST)

శ్రీకృష్ణుడు 120 సంవత్సరాల, 7 నెలల, ఆరు రోజులు జీవించాడట.. నిర్యాణం ఎప్పుడంటే?

శ్రీకృష్ణుడు అవతార పురుషుడు. మహాభారత సంగ్రామాన్ని నిర్వర్తించిన సారథి. కలియుగానికి స్వాగతం పలికేందుకు.. దుష్టశిక్షణ, శిష్టరక్షణార్థమై శ్రీకృష్ణుడు జన్మించాడు. శ్రావణమాసంలో ద్వాపరయుగాన, బహుళ పక్షం రోహి

శ్రీకృష్ణుడు అవతార పురుషుడు. మహాభారత సంగ్రామాన్ని నిర్వర్తించిన సారథి. కలియుగానికి స్వాగతం పలికేందుకు.. దుష్టశిక్షణ, శిష్టరక్షణార్థమై శ్రీకృష్ణుడు జన్మించాడు. శ్రావణమాసంలో ద్వాపరయుగాన, బహుళ పక్షం రోహిణీ నక్షత్రం అష్టమి తిథినాడు రెండోజాము వేళ చెరసాలలో దేవకీదేవి అష్టమ గర్భాన శ్రీకృష్ణపరమాత్మ అవతార పురుషుడిగా పుట్టాడు. ఆయన పుట్టుక దుష్టశిక్షణార్థం కోసం జరిగింది.
 
అందుకే రాక్షసులను, తన మేనమామ అయిన కంసుడిని కూడా చంపుతాడు. ఆపై మహాభారత సంగ్రామంలో దుష్టులను శిక్షిస్తాడు. ఇలా కారణ జన్ముడైన శ్రీకృష్ణుడు అవతార పురుషుడిగా 120 ఏళ్లపాటు జీవించాడని పురాణాలు చెప్తున్నాయి. మానవుడు అలా 120 సంవత్సరాలు జీవించడం సాధ్యం కాదు. అయితే కృష్ణుడు అవతార పురుషుడు కావడంతో.. నవగ్రహాల మహాదశకాలాన్ని జయించి జీవించాడని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు. 
 
సాధారణంగా జ్యోతిష్యం ప్రకారం నవగ్రహాల మహాదశల కాలం 120 సంవత్సరాలు. కేతు దశ- ఏడు సంవత్సరాలు, శుక్ర దశ- 20 సంవత్సరాలు, సూర్య దశ- ఆరు సంవత్సరాలు, చంద్ర దశ- 10 సంవత్సరాలు, కుజ దశ - ఏడు సంవత్సరాలు, రాహు దశ- 18 సంవత్సరాలు, బుధ దశ -17 సంవత్సరాలు, గురు- 16 సంవత్సరాలు, శని -19 సంవత్సరాలు. ఇలా నవ గ్రహాల దశాకాల ప్రభావాన్ని జయించడం మానవునికి అసాధ్యం. అయితే శ్రీకృష్ణుడు విష్ణుమూర్తి అవతారం కావడంతో 120 ఏళ్లకు పైగా జీవించాడు. 
 
శ్రీకృష్ణుడు 120 సంవత్సరాల, ఏడు నెలల, ఆరు రోజులు జీవించాడని పురాణాలు చెప్తున్నాయి. 3012 బీసీ ఫిబ్రవరి 18న మధ్యాహ్నం 2.27 నిమిషాల 30 సెకన్లకు శ్రీకృష్ణుడు నిర్యాణం చెందినట్లు విష్ణుపురాణం చెప్తోంది. మహాభారత సంగ్రామం ముగిసిన 36 సంవత్సరాల తర్వాత ద్వారకకు వెళ్ళిన శ్రీకృష్ణుడు ఆపై ఎవ్వరికీ కనిపించలేదు. మహాభారత యుద్ధం ముగిసే సమయానికి శ్రీకృష్ణుడి వయస్సు 89 సంవత్సరాలని మత్స్య పురాణం చెప్తోంది. దీనిప్రకారం ప్రతీ ఏడు చైత్రమాసం తొలిరోజును కృష్ణ నిర్యాణ దినంగా పరిగణిస్తారు. ఈ క్రమంలో సోమనాథ్ ట్రస్ట్ తొలిసారిగా 2009 ఏప్రిల్ 9న కృష్ణ నిర్యాణ దినంగా పాటించింది.