శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By chj
Last Modified: శనివారం, 22 ఏప్రియల్ 2017 (21:43 IST)

వేసవిలో పుదీనా కంపల్సరీ... ఇలా తీసుకోండి...

ఎండాకాలం రాగానే తెలుగు రాష్ట్రాల్లో చాలాచోట్ల పుదీనాతో కలిపిన నీళ్లు, మజ్జిగ తాగుతుంటారు. ఎందుకంటే పుదీనా వడదెబ్బ తగలకుండా అరికట్టగలుగుతుంది. పుదీనా ఆరోగ్యానికి ఎంతగానో మేలుచేస్తుంది. పుదీనా వేసవితాపంతో వేడక్కిన శరీరంలో వేడిని తగ్గించి, చల్లదనాన్ని ఇ

ఎండాకాలం రాగానే తెలుగు రాష్ట్రాల్లో చాలాచోట్ల పుదీనాతో కలిపిన నీళ్లు, మజ్జిగ తాగుతుంటారు. ఎందుకంటే పుదీనా వడదెబ్బ తగలకుండా అరికట్టగలుగుతుంది. పుదీనా ఆరోగ్యానికి ఎంతగానో మేలుచేస్తుంది. పుదీనా వేసవితాపంతో వేడక్కిన శరీరంలో వేడిని తగ్గించి, చల్లదనాన్ని ఇస్తుంది. ఇందుకోసం శుభ్రమైన తాజా పుదీనా ఆకులను మెత్తగా రుబ్బి, శరీరానికి పట్టించి ఇరవై నిమిషాలపాటు అలాగే ఉంచాలి. ఆ తరువాత చల్లటి నీటితో స్నానం చేస్తే వేసవిలో శరీరంలో పెరిగిన వేడి మటుమాయం అవుతుంది.
 
అలాగే కడుపులో వికారంగా అనిపించినప్పుడు పుదీనా వాసనను చూస్తే, వికారం మటుమాయం అవుతుంది. వాంతులతో బాధపడేవారు సైతం పుదీనా పచ్చడి తినటంవల్ల కోలుకుంటారు. గర్భిణిలలో తలెత్తే పలు అనారోగ్య సమస్యలకు పుదీనా పచ్చడి ఔషధంగా పనిచేస్తుంది. అదేవిధంగా తలనొప్పితో బాధపడేవారు పుదీనా ఆకులను ముద్దగా చేసి నుదుటిపై ఉంచితే ఉపశమనం లభిస్తుంది. అపస్మారక స్థితిలో వెళ్లినవారికి రెండు చుక్కల పుదీనా రసం ముక్కులో వేస్తే కోలుకుంటారు.
 
ఇంకా చిన్న పిల్లలు కడుపునొప్పి, కడుపు ఉబ్బరంతో బాధపడుతుంటే గోరువేచ్చని నీటిలో ఐదారు చుక్కల పుదీనా రసం కాచి తాగించడం వలన ఉపశమనం కలుగుతుంది. చిన్న పిల్లలకు జలుబు చేస్తే పుదీనా నుండి తయారయ్యే మెంథాల్ ముద్ద, కర్పూరం, కొబ్బరి నూనెలతో మిశ్రమం చేసి ఛాతికీ వీపునకు రాస్తే జలుబు తగ్గుతుందని ఆయుర్వేదం సూచిస్తోంది. నోటి దుర్వాసనతో ఇబ్బందిపడేవారు పుదీనా రసాన్ని నీటిలో కలిపి పుక్కిలించడం ద్వారా క్రిములను దూరంగా ఉంచి దుర్వాసనను పోగొట్టవచ్చు.
 
అలాగే గొంతు నొప్పితో బాధపడేవారు పుదీనా కషాయంలో ఉప్పు కలిపి పుక్కిలిస్తే సమస్య తొలగుతుంది. దంత వ్యాధులతో బాధపడేవారు సైతం ప్రతిరోజూ పుదీనా ఆకులను నమిలితే ఫలితం ఉంటుంది. గర్భిణిలలో తలెత్తే పలు అనారోగ్య సమస్యలకు పుదీనా పచ్చడి ఔషధంగా పనిచేస్తుంది. పుదీనా రసం తాగటంవల్ల తరచుగా వచ్చే వెక్కిళ్లను కూడా తగ్గించవచ్చు. జలుబు చేసినప్పుడు మరిగే నీటిలో కాస్త పసుపు మెంథాల్ వేసి ఆవిరిపడితే జలుబు నుండి త్వరగా ఉపశమనం పొందవచ్చు. కీళ్ళ నొప్పులతో బాధపడేవారు తరచూ పుదీనా తింటే ఎంతో మంచిది.