శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 19 నవంబరు 2020 (19:59 IST)

ముంబై పేలుళ్ల సూత్రధారి హఫీజ్‌కు పదేళ్ల జైలు శిక్ష

ముంబై పేలుళ్ల కుట్రలో ప్రధాన సూత్రధారి హఫీజ్ సయీద్‌కు పదేళ్ల జైలు శిక్ష పడింది. కరడుగట్టిన అంతర్జాతీయ ఉగ్రవాదిగా ముద్రవేసుకున్న హఫీజ్‌కు ఉగ్రవాద దాడులకు సంబంధించి రెండు కేసుల్లో పాక్‌ ఉగ్రవాద వ్యతిరేక న్యాయస్థానం అతనికి ఈ శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. జమాత్‌ ఉల్ దవా సంస్థ చీఫ్‌గా ఉన్నసయీద్‌ 2008 ముంబై పేలుళ్ల వెనుక ప్రధాన సూత్రధారి. 
 
ఉగ్రవాద సంస్థలకు నిధులు అందిస్తున్నారన్న కేసులో ఇప్పటికే 11 ఏళ్లు జైలు శిక్ష పడగా, ఈతడు ప్రస్తుతం లాహోర్‌లోని ఓ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. తాజాగా హఫీజ్‌తో పాటు మరో నలుగురికి పాక్‌ ఉగ్రవాద వ్యతిరేక న్యాయస్థానం జైలు శిక్ష విధించింది.
 
కాగా, ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు ముందుండి అన్ని తానై చూసుకునే జేయూడీ చీఫ్‌గా ఉన్న సయీద్‌ ఐక్యరాజ్య సమితి ప్రకటించిన అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలోనూ ఉన్నాడు. అలాగే అమెరికా అతనిపై 10 మిలియన్‌ డాలర్ల పారితోషికం కూడా ప్రకటించింది. 2008 ముంబై పేలుళ్లలో 166 మంది మృతి చెందగా, వందలాది మంది గాయపడ్డారు.