1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 24 జులై 2020 (16:18 IST)

కలత చెందిన బిల్ గేట్స్ : వ్యాక్సిన్ల ద్వారా ప్రజలను ఎపుడైనా చంపామా?

మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ కలత చెందారు. ఆయన గురించి వచ్చిన మీడియా కథనాలు చూసి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా, వ్యాక్సిన్ల ద్వారా ప్రజలను ఎపుడైనా చంపామా? అంటూ నిలదీశారు. అంతేకాదు.. వ్యాక్సిన్ల పేరు చెప్పి డబ్బు సంపాదించినట్టు ఆధారాలు చూపించాలంటూ సవాల్ విసిరారు. 
 
ప్రస్తుతం ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తోంది. దీంతో ఈ వైరస్ కట్టడికి కోసం ప్రపంచ వ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ పరిశోధనలకు మద్దతుగా మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ 250 మిలియన్ డాలర్లను విరాళాన్ని అందజేస్తున్నారు. 
 
అయితే, కరోనా వైరస్ వ్యాప్తి వెనుక బిల్ గేట్స్ హస్తం ఉందంటూ కుట్ర సిద్ధాంతాలు (కాన్స్ పిరసీ థీరీస్) ప్రచారంలోకి వచ్చాయి. కరోనా వ్యాక్సిన్ ద్వారా భూమిపై 15 శాతం ప్రజలను అంతమొందించాలన్నది ఆయన లక్ష్యమంటూ ఓ వీడియో ద్వారా ప్రచారంలో సాగుతోంది.
 
దీనిపై బిల్ గేట్స్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలను వ్యాక్సిన్ల ద్వారా ఎప్పుడైనా చంపామా? వ్యాక్సిన్ల ద్వారా మేం ఎప్పుడైనా డబ్బు కూడబెట్టామా? ఎవరైనా నిరూపించగలరా అంటూ సవాల్ విసిరారు. 
 
వాస్తవానికి ప్రజల ప్రాణాలు కాపాడే వ్యాక్సిన్ల కోసం ఇతర ఎన్జీవోల కన్నా ఎక్కువే ఖర్చు పెడుతున్నామని, అనేక వ్యాక్సిన్ల రూపకల్పనతో తమకు సంబంధం ఉన్న మాట నిజమే అయినా, వ్యాక్సిన్లతో ప్రజలను చంపాలని ఎప్పుడూ అనుకోలేదని స్పష్టం చేశారు.