బ్రస్సెల్స్ ఎయిర్పోర్టులో వరుస పేలుళ్లు... 11 మంది మృతి
బెల్జియం రాజధాని బ్రస్సెల్స్లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో మంగళవారం రెండు వరుస పేలుళ్ళు చోటుచేసుకున్నాయి. ఈ పేలుళ్ళ ధాటికి విమానాశ్రయం లోపలిభాగం చాలా మేరకు ధ్వంసంగా, 11 మంది మరణించినట్టు ప్రాథమిక సమాచారం. అనేక మంది ప్రయాణికులు గాయపడినట్టు తెలుస్తోది.
ఈ విమానాశ్రయంలో రెండు శక్తిమంతమైన పేలుళ్లు జరిగాయని కొందరు చెపుతుండగా, మరికొందరు మాత్రం.. ఆత్మాహుతి దాడులు జరిగినట్టు చెపుతున్నారు. కానీ, దాడులకు ముందు.. స్థానిక అరబిక్ భాషలో పలు నినాదాలు వినిపించినట్లు ప్రత్యక్ష సాక్షులను ఉటంకిస్తూ బెల్జియం మీడియా పేర్కొంది.
మరోవైపు ఎయిర్ పోర్టులో పేలుళ్లు జరిగిన వెంటనే రంగంలోకి దిగిన భద్రతా బలగాలు ఎయిర్ పోర్టు పరిసరాలను జల్లెడ పట్టాయి. ఈ తనిఖీల్లో పేలని బాంబులు కూడా లభించినట్లు సమాచారం. పేలుళ్లు జరిగిన వెంటనే ఎయిర్ పోర్టును మూసేసిన పోలీసులు.. ఎయిర్ పోర్టులోని ప్రయాణికులను బయటకు పంపారు. పేలుళ్లతో అక్కడ భీతావహ వాతావరణం నెలకొంది. బ్రస్సెల్స్ వ్యాప్తంగా హై అలెర్ట్ ప్రకటించి, మెట్రో రైల్ సేవలను పూర్తిగా నిలిపివేశారు.