బుధవారం, 25 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 25 సెప్టెంబరు 2024 (12:03 IST)

చైనా డ్యామ్‌తో పొంచివున్న ప్రమాదం.. భూ గమనాన్ని ప్రభావితం చేస్తున్న త్రీ గోర్జెన్

Three Gorges Dam
చైనా దేశం నిర్మించిన డ్యామ్‌తో పెను ప్రమాదం పొంచివుంది. చైనా దేశం త్రీ గోర్జెన్ పేరుతో అతిపెద్ద డ్యామ్‌ను నిర్మించింది. ఇది భూ గమనాన్ని సైతం ప్రభావితం చేస్తున్న ఖగోళ, భూగోళ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ డ్యామ్ మానవాళికి ఏమాత్రం శ్రేయస్కరం కాదని బ్రిటన్ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ డ్యామ్ వల్ల మానవాళికి ముప్పు పొంచి ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 
 
చైనాలోని యాంగ్జీ నదిపై సుమారు 2.33 కిలో మీటర్ల పొడవు, 181 మీటర్ల ఎత్తులో 2006లో త్రీగోర్జెస్ డ్యామ్ నిర్మించిన విషయం తెల్సిందే. ఈ డ్యామ్‌ను 1994లో ప్రారంభించి 2006లో పూర్తి చేశారు. డ్యామ్ నిర్మాణం కోసం 114 పట్టణాలను, 1,680 గ్రామాలను చైనా నేల మట్టం చేశారు. ఈ డ్యామ్‌కు మూడు నదుల నుండి నీరు వచ్చి చేరుతుంది. సుమారు 10 ట్రిలియన్ గ్యాలన్ల నీరు డ్యామ్‌లో నిల్వ ఉంటోంది. అంత భారీ మొత్తంలో ఒకే చోట నీరు చేరడంతో భూ పరిభ్రమణ వేగం 0.06 మైక్రో సెకెన్లు తగ్గిపోయిందని అప్పట్లో శాస్త్రవేత్తలు లెక్కలు అంచనా వేశారు. 
 
అంతేకాకుండా సూర్యుడి నుంచి భూమి దూరం రెండు సెంటీ మీటర్ల మేర దూరం జరిగిందని వెల్లడించారు. దీని ప్రభావం ప్రస్తుతం ఇంకా పెరుగుతోందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. భూమిపై భారీ మొత్తంలో ఏమైనా మార్పులు చోటుచేసుకున్నప్పుడు దాని ప్రభావం భూ గమనంపై పడుతుందని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా కూడా పదే పదే హెచ్చరిస్తోంది. ప్రపంచంలోనే అతి పెద్దవైన మూడు అణు విద్యుత్ కేంద్రాల ఉత్పత్తికి సమానంగా ఈ డ్యామ్ నుండి 22,500 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. ఈ డ్యామ్‌లోని నీటి నిల్వ కారణంగా భూమి అడుగున ఒత్తిడి పెరిగి భూకంపాలు సంభవించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.