1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 19 జూన్ 2020 (15:29 IST)

రాడ్లకు ఇనుప మేకులు.. బేస్ బాల్ బ్యాట్లకు ఫెన్సింగ్ వైర్లు చుట్టి తెచ్చారు.. వైరల్

Iron rods with nails
తూర్పు లడఖ్‌లో భారత్‌-చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణలు చోటు చేసుకుని పదుల సంఖ్యలో సైనికులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఆ సమయంలో చైనా అదుపులోకి తీసుకున్న 10 మంది భారత సైనికులను ఆ దేశం విడిచిపెట్టింది. ఇరు దేశాల సైనికాధికారుల మధ్య జరిగిన చర్చల నేపథ్యంలో భారత సైనికులను చైనా విడుదల చేసింది. వారిలో ఓ లెఫ్టినెంట్‌ కల్నల్, ముగ్గురు మేజర్లు కూడా ఉన్నారు.  
 
లడఖ్ సమీపంలోని వాస్తవాధీనరేఖ వద్ద గాల్వన్ లోయలో భారత్, చైనా బలగాల మధ్య భీకర ఘర్షణ జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో చైనా సైనికులు ఇనుపరాడ్లు, కర్రలు ఉపయోగించినట్టు భారత సైన్యం ఇదివరకే తెలిపింది. ఆ రాడ్లకు ఇనుపమేకులు అమర్చి ఉన్నాయని, బేస్ బాల్ బ్యాట్లకు ఫెన్సింగ్ వైర్లు చుట్టి ఆయుధాలుగా వాడారని వార్తలు వచ్చాయి. తుపాకులు ఉపయోగించకుండానే పెద్దసంఖ్యలో ప్రాణనష్టం కలిగించడానికి ఇలాంటి మొరటు ఆయుధాలను సరిహద్దు విధుల్లో ఉన్న చైనా సైనికులు ఉపయోగించారని కథనాలు వచ్చాయి. 
 
తాజాగా, చైనా సైనికులు గాల్వన్ లోయ ఘర్షణల్లో ఉపయోగించిన ఆయుధాలు ఇవేనంటూ కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భారత సైన్యానికి చెందిన ఓ సీనియర్ అధికారి ఆ ఫొటోలను తమ దృష్టికి తీసుకువచ్చినట్టు అంతర్జాతీయ మీడియా తెలిపింది.