గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 7 ఏప్రియల్ 2020 (09:36 IST)

బ్రిటన్ ప్రధాని ఆరోగ్యం విషమం??? ఐసీయూలో ట్రీట్మెంట్

కరోనా వైరస్ దెబ్బకు దేశాధి నేతలు పలువురు వణికిపోతున్నారు. ముఖ్యంగా, 60 యేళ్లు పైబడిన దేశాధినేతలు విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటారు. ఇలాంటి వారికి వైరస్ సోకితే తిరిగి కోలుకోవడం కష్టమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ వైరస్ బారినపడిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో ఆయన్ను లండన్‌లోని సెయింట్ థామస్ ఆస్పత్రిలో ఐసీయూ వార్డులో ఉంచి ప్రత్యేక వైద్య బృదం చికిత్స చేస్తోంది. 
 
నిజానికి వారం రోజుల క్రితం ఆయనలో కరోనా వైరస్ లక్షణాలు కనిపించడంతో తన ఇంట్లోనే స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయారు. వారం తర్వాత కూడా ఈ వైరస్‌ లక్షణాలు తగ్గలేదు. శరీరంలో ఉష్టోగ్రత కూడా అదుపులోకి రాలేదు. దీంతో వ్యక్తిగత వైద్యుని సలహా మేరకు సెయింట్ థామస్ ఆస్పత్రిలో చేరారు. 
 
అయితే, అక్కడ వ్యాధి తీవ్రత పెరగడంతో బ్రిటన్ ప్రధానిని ఐసీయూ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. బోరిస్‌ ఆరోగ్యం మరింత క్షీణించిందని ప్రధాని విదేశాంగ సెక్రటరీ డోమినిక్‌ రాబ్‌ వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్టు చెబుతున్నారు. 
 
మరోవైపు బ్రిటన్‌లో పరిస్థితులు రోజు రోజుకూ మరింత ప్రమాదకరంగా తయారవుతున్నాయి. ఇప్పటికే అమలులో ఉన్న షట్‌డౌన్‌ ఆంక్షల్ని మరింత కఠినతరం చేశారు. ప్రభుత్వ ఆదేశాల్ని ఖచ్చితంగా పాటించకపోతే బహిరంగ వ్యాయామాలపైనా నిషేధం విధిస్తామని ప్రభుత్వం హెచ్చరించింది. ఇలాంటి పరిస్థితుల్లో తమ దేశ ప్రధాని ఆరోగ్యం విషమంగా ఉండటంతో ఆ దేశ ప్రజలు ఆందోళన చెందుతున్నారు.