శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 30 అక్టోబరు 2020 (15:20 IST)

పాకిస్థాన్ మ్యాచ్ నుంచి పాక్ ఆక్రమిత కాశ్మీర్ మాయం.. షాకిచ్చిన సౌదీ!

పాకిస్థాన్ దేశానికి సౌదీ అరేబియా తేరుకోలని షాకిచ్చింది. పాకిస్థాన్ మ్యాప్ నుంచి పాక్ ఆక్రమిత కాశ్మీర్ భూభాగాన్ని తొలగించింది. అలాగే, గిల్గిత్ ‌- బల్టిస్థాన్‌లను కూడా తొలగించేసింది. 
 
వచ్చేనెల 21-22 తేదీల్లో రియాద్‌ వేదికగా జీ-20 దేశాల సదస్సు జరుగనుంది. ఈ సందర్భంగా ప్రపంచ పటంలోని జీ-20 సభ్య దేశాలను డార్క్‌షేడ్‌తో గుర్తించి ఒక పత్రాన్ని సౌదీ రూపొందించింది. అయితే పీవోకే, బల్టిస్థాన్‌లు లేకుండానే పాకిస్థాన్‌ సరిహద్దులను డార్క్‌షేడ్‌ చేసింది. అయితే ఈ పరిణామంపై పాక్‌ స్పందించలేదు.
 
నిజానికి సౌదీ అరేబియా, పాకిస్థాన్ రెండూ ముస్లిం దేశాలే. కానీ ఇరు దేశాల మధ్య సంబంధాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. ముఖ్యంగా పాక్ పట్ల సౌదీ అంటీముట్టగానే వ్యవహిస్తోంది. ఈ క్రమంలో పాకిస్థాన్‌ మ్యాప్ నుంచి పీవోకేను తొలగించి తేరుకోలేని షాకిచ్చింది.
 
వాస్తవానికి భారత ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్‌ రాష్ట్రంలో అమల్లో ఉన్న 370 ఆర్టికల్‌ను ఎత్తివేసింది. దీనిపై సౌదీ అరేబియా పెద్దగా స్పందించలేదు. ఇది పాక్‌కు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ఈ పరిణామం తర్వాత ఆ రెండు మిత్ర దేశాల మధ్య అంతరం పెరిగింది.
 
మరోవైపు జీ-20 దేశాల మ్యాప్‌లతో కూడిన ప్రపంచ పటంలో దేశ సరిహద్దులను తప్పుగా పొందుపర్చారని భారత్‌ తీవ్రంగా ఆక్షేపించింది. ఈ మేరకు రియాద్‌, ఢిల్లీ రాయాబార కార్యాలయాల ద్వారా సౌదీకి తమ అభ్యంతరాన్ని తెలిపింది. ఈ విషయంలో తక్షణమే సవరణలు చేపడతామని సౌదీ తెలిపిందని మన విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్‌ శ్రీవాస్తవ పేర్కొన్నారు. ఆ ప్రకారంగానే పాక్ చిత్రపటం నుంచి పీవోకేను తొలగించింది.