శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , బుధవారం, 21 జూన్ 2017 (05:09 IST)

డబ్బు తీసుకుని ఆడే క్రికెటర్లలో దేశభక్తిని చూస్తున్నారా.. మండిపడ్డ బంగ్లా జట్టు కెప్టెన్ మొర్తజా

మొర్తజా ఆ వ్యాఖ్యల్లో క్రికెట్‌కూ, దేశభక్తికీ ముడిపెట్టే తీరును ప్రశ్నించాడు. ఒక వైద్యుడితో, శ్రామికుడితో పోలిస్తే తాము చేస్తున్నదేమీ లేదని తేల్చిచెప్పాడు. నిజమైన దేశభక్తి ఎలాంటి చర్యల్లో ఇమిడి ఉంటుందో హితవు చెప్పాడు. అకారణంగా, అనవసరంగా ఏదో ఒక పేరు చ

గుంపు మనస్తత్వం ప్రమాదకరమైనది. అది కొన్ని పదాలకున్న అర్ధాలను మారుస్తుంది. ప్రతీకలకు కొత్త భాష్యం చెబుతుంది. సందేహాలను లేవనెత్తేవారిని అనుమానంతో చూస్తుంది. ప్రశ్నించడం ద్రోహమంటుంది. దాడులకు దిగు తుంది. వర్తమానంలో ఈ గుంపు మనస్తత్వం నీడ పడని చోటంటూ లేదు. తాజాగా బంగ్లాదేశ్‌ క్రికెట్‌ కెప్టెన్‌ మష్రఫె మొర్తజా చేసిన వ్యాఖ్యలు గమనిస్తే ఈ గుంపు మనస్తత్వం మన దగ్గర మాత్రమే కాదు... ఆ దేశంలో కూడా ఎంతగా వేళ్లూనుకుందో, అది ఎంతటి సమస్యగా మారిందో అర్ధమవుతుంది.

మొర్తజా ఆ వ్యాఖ్యల్లో క్రికెట్‌కూ, దేశభక్తికీ ముడిపెట్టే తీరును ప్రశ్నించాడు. ఒక వైద్యుడితో, శ్రామికుడితో పోలిస్తే తాము చేస్తున్నదేమీ లేదని తేల్చిచెప్పాడు. నిజమైన దేశభక్తి ఎలాంటి చర్యల్లో ఇమిడి ఉంటుందో హితవు చెప్పాడు. అకారణంగా, అనవసరంగా ఏదో ఒక పేరు చెప్పి ఒక్కరిని లేదా కొందరిని లక్ష్యంగా చేసుకుని గుంపులు దౌర్జన్యాలకు పాల్పడుతున్న ఉదంతాల గురించి విని, చానెళ్లలో చూసి ఆందోళన పడుతున్నవారికి... ఒక రకమైన నిర్లిప్త స్థితికి, నిరాశామయ వాతా వరణంలోకి జారుకుంటున్నవారికి మొర్తజా చేసిన వ్యాఖ్యలు ఊరటనిస్తాయి.

మన పొరుగునున్న ఒక చిన్న దేశం నుంచి ఇలాంటి వివేకవంతమైన స్వరం వినడం సంతోషం కలిగిస్తుంది. ఆ వ్యాఖ్యలు ఉన్మాదంలో కొట్టుకుపోతున్న వారికి మాత్రమే హితవచనాలు కావు... ఇలాంటి సమయాల్లో తమ బాధ్య తేమిటో గుర్తించని దేశదేశాల్లోని సెలబ్రిటీలకు సైతం కర్తవ్యాన్ని గుర్తు చేసే విలువైన మాటలు.
 
ఫేస్‌బుక్‌లోనో, మరో చోటనో పెట్టే ఒక వ్యాఖ్య లేదా ఒక ‘లైక్‌’ ఆగ్రహావేశాలకూ, విద్వేషాలకూ దారితీస్తోంది. కేవలం సామాజిక మాధ్యమాలే కాదు... క్రికెట్‌ క్రీడతో అల్లుకుని ఉండే కార్పొరేట్‌ పెట్టుబడులు, లాభార్జన దృష్టి కూడా దాన్నొక క్రీడగా ఉండనివ్వడం లేదు. జాతీయతనో, దేశభక్తినో ప్రేరేపించడానికి అదొక సాకుగా మారింది. అందులో నెగ్గడంపైనే దేశ గౌరవప్రతిష్టలు ఆధారపడి ఉన్నాయన్నంతగా ప్రచారం జరుగుతోంది. మన టీం నెగ్గితే వీధుల్లోపడి గంతులేయడం, ఓడిన దేశాన్ని కించపరుస్తూ, అవహేళన చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించడం ఎక్కువవుతోంది. మన టీం ఓడితే ఆ క్రీడాకారులు ద్రోహులన్నట్టు అవమానిస్తూ మాట్లాడటం, టెలివిజన్‌ సెట్లు బద్దలు కొట్టడం దేశభక్తికి చిహ్నమవుతోంది.
 
ప్రతిదీ లాభాలు ఆర్జించి పెట్టే సరుకుగా మారినచోట క్రికెట్‌ లేదా మరో క్రీడ దానికి అతీతంగా ఉండాలనుకోవడం అత్యాశే అయినా...నిష్కారణంగా కొంద రిని శత్రువులుగా, ద్రోహులుగా పరిగణించే మనస్తత్వం పెరగడం ఆందోళన కలిగిస్తుంది. సమాన సామర్ధ్యం గల రెండు టీంలు మైదానంలో నువ్వా నేనా అని తలపడుతుంటే దాన్ని ఆసక్తిగా తిలకించడం, ఆనందించడం, మెరుగైన నైపుణ్యాన్ని ప్రదర్శించినవారిని మెచ్చుకోవడం కనుమరుగవుతోంది.

క్రికెట్‌ క్రీడాకారులు, బీసీసీఐ కూడా ఇలాంటి పెడ ధోరణులపై పెదవి విప్పకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఒక్క క్రికెట్‌ అనే కాదు... తినే తిండిని, కట్టే బట్టనూ, ఆచరించే సంస్కృతిని ఎత్తి చూపడం, దాడులకు దిగడం మన దేశంలో రివాజైంది. వీటన్నిటికీ కళ్లు మూసుకోవడం, మౌనంవహించడం బాధ్యతా రాహిత్యం అవుతుందని సెలబ్రిటీలు గమనించాలి. మొర్తజాను చూసైనా కర్తవ్యం గుర్తెరగాలి.