శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 28 జనవరి 2020 (16:24 IST)

డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన.. ఫిబ్రవరి 21 నుంచి 24వ తేదీ లోపు..?

భారత్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్యటించనున్నారు. ఫిబ్రవరి 21 నుంచి 24వ తేదీ వరకు భారత్‌లో పర్యటించే అవకాశాలున్నాయని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. ట్రంప్ పర్యటనలో విడిదిగా ఢిల్లీలోని ఐటీసీ మౌర్య హోటల్‌లో బస చేసేందుకు ప్రెసిడెన్షియల్‌ సూట్‌ను బుక్‌ చేసినట్లు తెలిపింది. 
 
ఈ పర్యటనలో భాగంగా ప్రధాన మంత్రి మోదీతో ట్రంప్‌ భేటీ కానున్నారు. అమెరికా నుంచి 5.6 బిలియన్ డాలర్ల ఎగుమతులపై జీరో టాక్స్‌ను అనుమతించే జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్స్ (జీఎస్పీ)పై వీరిద్దరి భేటీలో చర్చించే అవకాశం ఉంది. 
 
అహ్మదాబాద్‌ వేదికగా ద్వైపాక్షిక చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఉభయ దేశాల మధ్య పలు వాణిజ్య ఒప్పందాలతో పాటు ఇండో ఫసిఫిక్‌, ఆప్ఘనిస్తాన్‌, ఇరాన్‌ ప్రాంతాలలో పెట్రేగిపోతున్న ఉగ్రవాదం అంశాలు చర్చకు రానున్నాయి. 
 
ట్రంప్ పర్యటన సందర్భంగా కొత్త సైనిక హార్డ్వేర్ ఒప్పందం జరిగే అవకాశం లేకపోయినప్పటికీ, భారతదేశం అపాచీ అటాక్ హెలికాప్టర్లు, భారత నావికాదళానికి బహుళ ప్రయోజన హెలికాప్టర్లు, అమెరికన్ డిఫెన్స్ కాంట్రాక్టర్ల నుండి పి 8 ఐ మల్టీ మిషన్ విమానాలను కొనుగోలు చేయాలని భావిస్తోంది.