గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 29 జులై 2018 (16:45 IST)

పీటీఐను సైన్యమే గెలిపించింది : ఇమ్రాన్ మాజీ భార్య ఆరోపణలు

పాకిస్థాన్ ఎన్నికల్లో పాకిస్థాన్‌ తెహ్రీక్‌ ఏ ఇన్సాఫ్‌ (పీటీఐ) 118 సీట్లు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది. దీనిపై ఆ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య రెహం ఖాన్ సంచలన ఆరోపణలు చేసింది. పీటీఐను

పాకిస్థాన్ ఎన్నికల్లో పాకిస్థాన్‌ తెహ్రీక్‌ ఏ ఇన్సాఫ్‌ (పీటీఐ) 118 సీట్లు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది. దీనిపై ఆ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య రెహం ఖాన్ సంచలన ఆరోపణలు చేసింది. పీటీఐను పాకిస్థాన్ సైన్యమే గెలిపించిందని ఆరోపించారు.
 
ఈ ఎన్నికల ఫలితాలపై ఆమె స్పందిస్తూ, పాకిస్థాన్ ఎన్నికల్లో పెద్ద ఎత్తున రిగ్గింగ్‌ జరగడం వల్లే ఇమ్రాన్‌ ఖాన్‌ ఎన్నికల్లో గెలిచారన్నారు. ఇందుకు సైన్యం అన్ని సహాయ సహకారాలు అందించిందని తెలిపారు. పాక్‌ సైన్యం నుంచి ఇమ్రాన్‌ లబ్ధి పొందాడని, ఆయన ప్రభుత్వం ఏర్పాటు చేశాక విదేశాంగ శాఖ సైన్యం చేతిలోకి వెళ్లిపోతుందన్నారు. 'పాక్‌ ఎన్నికలు ఆశ్చర్యపరచలేదు. ఫలితాలు ఊహించినవే. చాలామంది ఇమ్రాన్‌ను ప్రోత్సహించారు. ఆయనపై ఎంతో పెట్టుబడి పెట్టారు. ఈ ఎన్నికల్లో రిగ్గింగ్‌ జరిగింది. ఆర్మీ ఇప్పుడు పాక్‌ విదేశాంగ శాఖను నిర్వహించబోతోంది' అని జోస్యం చెప్పారు. 
 
ఇకపోతే, తాజాగా పాకిస్థాన్‌లోని 270 స్థానాలకు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇమ్రాన్‌ సారథ్యంలోని పీటీఐ 115 స్థానాలు గెలుపొందినట్టు ఎన్నికల సంఘం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో చిన్న పార్టీలు, స్వతంత్రుల మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటుకు ఇమ్రాన్‌ సమాయత్తమవుతున్నారు. త్వరలోనే పాక్‌ ప్రధానిగా ఆయన పగ్గాలు చేపట్టనున్నారు.