1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 24 సెప్టెంబరు 2017 (09:28 IST)

ఐటీ రంగంలో భారత్ ... ఉగ్రవాదంలో పాకిస్థాన్ సూపర్ పవర్ : సుష్మా స్వరాజ్

ఐక్యరాజ్య సమితి సాధారణ సమావేశాల్లో పాకిస్థాన్‌ను భారత విదేశీ వ్యవహారాల శాఖామంత్రి సుష్మా స్వరాజ్ ఉతికి ఆరేశారు. ఐటీ రంగంలో భారత్ సూపర్‌ పవర్‌గా ఉంటే.. ఉగ్రవాదాన్ని ఎగుమతి చేయడంలో పాకిస్థాన్ అగ్రగామిగా

ఐక్యరాజ్య సమితి సాధారణ సమావేశాల్లో పాకిస్థాన్‌ను భారత విదేశీ వ్యవహారాల శాఖామంత్రి సుష్మా స్వరాజ్ ఉతికి ఆరేశారు. ఐటీ రంగంలో భారత్ సూపర్‌ పవర్‌గా ఉంటే.. ఉగ్రవాదాన్ని ఎగుమతి చేయడంలో పాకిస్థాన్ అగ్రగామిగా ఉందని ఆమె ఎద్దేవా చేశారు. 
 
పాకిస్థాన్ ఉగ్రవాదానికి ఊతమిస్తూ ఉగ్రవాదులను తయారు చేసే కేంద్రంగా తయారైందని ఆరోపించారు. పాకిస్థాన్ టెర్రరిస్థాన్‌గా తయారైందన్నారు. పాక్ ఉగ్రవాదులను తయారు చేస్తే భారత్ డాక్టర్లు, సైంటిస్టులను తయారు చేసిందన్నారు. పాకిస్థాన్‌ ఉగ్రవాదులకు నిధులు సమకూరుస్తుందని ఆరోపించారు. 
 
భారత్ ఐఐటీలు, ఐఐఎంలు ఏర్పాటు చేస్తే పాకిస్థాన్ లష్కర్ ఎ తొయిబా, జైష్ ఎ మహ్మద్ వంటి తీవ్రవాదా కార్ఖానాలను ఏర్పాటు చేసిందని సుష్మ ఎద్దేవా చేశారు. ప్రపంచానికి సవాలుగా మారిన ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేసేందుకు ప్రపంచ దేశాలన్నీ కలిసిరావాలన్నారు. ఉగ్రవాదాన్ని సమాధి చేయాలని సుష్మ పిలుపునిచ్చారు.
 
ఇకపోతే... ఐక్యరాజ్య సమితి సాధారణ సమావేశాల్లో పాక్ ప్రధాని షాహిద్ అబ్బాసీ ప్రసంగాన్ని సభికులు ఎగతాళి చేశారన్నారు. భారత్ ఉగ్రవాదాన్ని ఎగుమతి చేస్తోందన్న ఆయన వ్యాఖ్యలకు జనాలు నవ్వు ఆపుకోలేకపోయారన్నారు. ఆయన ప్రసంగాన్ని విన్నవారు ‘‘చూడండి.. ఎవరు, ఏం మాట్లాడుతున్నారో’’ అంటూ వెక్కిరించారని సుష్మ పేర్కొన్నారు.
 
భారత్ అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోంటే పాకిస్థాన్ తమతో ఘర్షణ కోసం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ‘‘మీరేం ఉత్పత్తి చేస్తున్నారు? ఉగ్రవాదాన్ని, ఉగ్రవాద క్యాంపులను’’ అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘లష్కరే తాయిబా, జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్, హక్కానీ నెట్‌వర్క్..’’ ఇవన్నీ మీ గడ్డపై పుట్టినవేగా?’’ అని నిలదీశారు.
 
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ప్రపంచంలోనే భారత్ సూపర్ పవర్‌గా నిలిచిందని పేర్కొన్న సుష్మ.. పాకిస్థాన్ మాత్రం ఉగ్రవాద కార్ఖానాగా మారిందని ఆరోపించారు. భూతం ఎప్పటికీ భూతమేనని, వీటిలో మంచి భూతం, చెడు భూతం అనేవి ఉండవని, ఉగ్రవాదంపై పోరాడి తీరాల్సిందేనని ఐరాసకు పిలుపునిచ్చారు.