ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 21 జులై 2019 (12:23 IST)

కులభూషణ్‌కు పాక్ సాయం... దౌత్యవేత్తలతో సంప్రదింపులకు ఓకే

గూఢచర్యం ఆరోపణలపై అరెస్టు అయి తమ చెరలో ఉన్న భారత నౌకాదళ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్‌కు సాయం అందించేందుకు పాకిస్థాన్ ముందుకు వచ్చింది. ఇందులోభాగంగా, భారత దౌత్యాధికారులతో సంప్రదింపులు జరుపుకోవడానికి అనుమతినిస్తామని పాక్ విదేశాంగశాఖ వెల్లడించింది. ఇందుకోసం అవసరమైన విధి విధానాలను రూపొందిస్తున్నట్టు చెప్పారు.
 
అంతర్జాతీయ న్యాయస్థానం నిర్ణయానికి అనుగుణంగా దౌత్యసంబంధాలపై వియన్నా సదస్సు తీర్మానంలోని 36వ అధికరణం, పేరాగ్రాఫ్ 1(బీ) ప్రకారం కుల్‌భూషణ్ జాదవ్‌కు గల హక్కులపై ఆయనకు సమాచారం ఇచ్చాం అని గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. జాదవ్ భారత దౌత్యాధికారులతో సంప్రదింపులు జరుపుకొనేందుకు బాధ్యతాయుతమైన దేశంగా పాకిస్థాన్ అనుమతినిస్తుంది అని వివరించింది. 
 
అయితే, పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ మాత్రం ఆయన గుర్రుగానే ఉన్నారు. కుల్‌భూషణ్ నేరానికి పాల్పడ్డారంటూ ఆరోపణలు గుప్పించారు. ఐసీజే తీర్పును అభినందిస్తున్నట్టు చెప్పిన ఆయన... జాద‌వ్‌ను నిర్దోషిగా తేల్చ‌నందుకు, రిలీజ్ చేయ‌మ‌ని ఆదేశించ‌నందుకు, తిరిగి అప్ప‌గించాల‌ని తీర్పులో చెప్ప‌నందుకు హ‌ర్షిస్తున్న‌ట్లు ఇమ్రాన్ ట్వీట్ చేశారు. పాకిస్థాన్ ప్ర‌జ‌ల ప‌ట్ల కుల్‌భూష‌ణ్ నేరాల‌కు పాల్ప‌డ్డార‌ని, ఆ కేసుల్లో అత‌ను దోషిగా ఉన్నాడ‌ని ఇమ్రాన్ తెలిపారు. అయితే అంత‌ర్జాతీయ చ‌ట్టం ప్ర‌కార‌మే పాక్ ఈ కేసులో ముందుకు వెళ్తుంద‌ని ఇమ్రాన్ త‌న ట్వీట్‌లో చెప్పారు.