1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 10 ఫిబ్రవరి 2021 (21:34 IST)

ప్యాంగాంగ్‌ సరస్సు నుంచి చైనా, భారత్‌ బలగాల ఉపసంహరణ

ప్యాంగాంగ్‌ సరస్సు నుంచి చైనా, భారత్‌ బలగాల ఉపసంహరణ మొదలైందని చైనా సైన్యం బుధవారం తెలిపింది. కొన్నినెలలుగా సరిహద్దులో ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. 'ఫిబ్రవరి 10 నుంచి పాంగాంగ్‌తో సరస్సు ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లోని చైనా, భారత్‌ ఫ్రంట్‌లైన్ దళాలు ఉపసంహరణ మొదలైంది. భారత్, చైనా మధ్య కార్ప్స్‌ కమాండర్‌ స్థాయి 9వ విడత చర్చల్లో ఇరుపక్షాలు ఏకాభిప్రాయానికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు' పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ సీనియర్‌ కల్నల్‌ వీ కియాన్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
 
కాగా, తూర్పు లఢాఖ్‌లో భారత్, చైనాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు తగ్గించేందుకు జనవరి 24న ఇరుదేశాల మిలటరీ కమాండర్‌ స్థాయి అధికారుల మధ్య 9వ విడత చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. కమాండర్ల మధ్య జరిగిన చివరి రౌండ్‌ చర్చల్లో ఏకాభిప్రాయం కుదిరింది. దీంతో తూర్పు లఢాఖ్‌లోని అన్ని వివాదాస్పద కేంద్రాల నుంచి బలగాలను ఉపసంహరించుకుంటున్నట్లు చైనా రక్షణ మంత్రిత్వశాఖ ప్రకటించింది.