శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 30 సెప్టెంబరు 2018 (16:35 IST)

ఇండోనేషియా భూకంప పెనువిలయం : 850కు పెరిగిన మృతులు

ఇండోనేషియాలో భూకంప పెను విలయానికి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. శుక్రవారం ఇండోనేషియాలో భూకంపం, సునామీ రూపంలో ఘోర కలి సంభవించిన విషయం తెల్సిందే. 7.5 తీవ్రతతో భూకంపం సంభవించడం,

ఇండోనేషియాలో భూకంప పెను విలయానికి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. శుక్రవారం ఇండోనేషియాలో భూకంపం, సునామీ రూపంలో ఘోర కలి సంభవించిన విషయం తెల్సిందే. 7.5 తీవ్రతతో భూకంపం సంభవించడం, ఆ వెంటనే సునామీ విరుచుకుపడడంతో వందలాదిమంది ప్రాణాలు కోల్పోయారు.
 
శనివారం వరకు 400గా ఉన్న మరణాల సంఖ్య ఆదివారం నాటికి రెండింతలైంది. ఏకంగా 832 మంది ప్రాణాలు కోల్పోయినట్టు ఆ దేశ ప్రకృతి విపత్తుల సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన 540 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
 
సులావెసి ద్వీపంలో తొలుత భూకంపం సంభవించగా, ఆ వెంటనే సునామీ విరుచుకుపడింది. తీర ప్రాంతాల్లో రాకాసి అలలు ఉవ్వెత్తున ఎగసిపడి వేలాదిమందిని పొట్టనపెట్టుకున్నాయి. తీర పట్టణమైన పాలు సునామీ దెబ్బకు కకావికలమైంది. మొత్తం మృతి చెందిన 832 మందిలో 821 మంది ఈ పట్టణానికి చెందిన వారే కావడం విషాదం. 
 
మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. తీరంలో ఎక్కడ చూసినా శవాల గుట్టలే దర్శనమిస్తున్నాయి. 2004 తర్వాత ఇంత భారీ స్థాయిలో సునామీ సంభవించడం ఇండోనేషియాలో ఇదే తొలిసారి. సునామీ కారణంగా విద్యుత్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. దీంతో పట్టణం అంధకారంలో చిక్కుకుంది. వాటర్ పైపులు ధ్వంసం కావడంతో తాగేందుకు కూడా నీళ్లు లేక ప్రజలు తల్లడిల్లిపోతున్నారు.