గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By వాసు
Last Updated : బుధవారం, 13 మార్చి 2019 (15:30 IST)

మసూద్‌పై ఉగ్రవాది ముద్ర... చైనా నోరు మూయించిన భారత్.. ఎలా?

పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ అధిపతి మసూద్ అజార్‌‌పై అంతర్జాతీయ ఉగ్రవాది ముద్ర వేయనివ్వకుండా ఎంతో కాలంగా ఐక్యరాజ్యసమితి (ఐరాస)లో మోకాలడ్డుతున్న చైనాకు భారత్ తేరుకోలేని షాకిచ్చింది. జైషేతో మసూద్ అజార్‌కు సంబంధాలున్నట్టు రుజువు చేసే ఆధారాలను ఐరాసకు సమర్పించింది. భారత్ ఈ ఆధారాలను ఆడియో టేపుల రూపంలో సమర్పించినట్టు సమాచారం. 
 
జైషే మహ్మద్‌తో మసూద్‌కు సంబంధాలున్నట్లు ఎటువంటి ఆధారాలు లేవంటూ చైనా వాదిస్తున్న నేపథ్యంలో భారత్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. గత పదేళ్లుగా జైషే కార్యకలాపాలతో మసూద్‌కు సంబంధాలున్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని చైనా వాదిస్తూ వచ్చింది. మసూద్‌ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించేందుకు ఈ నెల 13వ తేదీలోపు ఏకగ్రీవ నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా.. ఐరాస భద్రతా మండలిలో ఒక్క చైనానే భారత్ వాదనను అడ్డుకుంటూ వస్తోంది.
 
గత నెల 14న 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లను పొట్టనబెట్టుకున్న పుల్వామా ఉగ్రదాడి తమ పనేనంటూ జైషే మహ్మద్ ప్రకటించుకున్న సంగతి అందరికీ తెలిసిందే. పుల్వామా దాడితో భారత్-పాక్‌ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తగా... పాక్ గడ్డపై ఆశ్రయం పొందుతున్న ఉగ్రమూకలను నిర్మూలించాల్సిందేనంటూ అంతర్జాతీయ దేశాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించే ప్రక్రియకు అడ్డు తగలొద్దంటూ అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ తదితర దేశాలు చైనాను కోరినట్లు సమాచారం.