శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 20 ఆగస్టు 2019 (16:10 IST)

ఎంజాయ్ చేద్దామని పిలిచి మందుకొట్టి నిద్రపోయిన ప్రియుడు.. ఇంటికి నిప్పు పెట్టిన ప్రియురాలు

ఓ ప్రియుడు తన ప్రియురాలిని ఎంజాయ్ చేసేందుకు ఇంటికి పిలిచాడు. కానీ, ప్రియురాలు వచ్చే సమయానికి అతను పీకల వరకు మందుకొట్టి నిద్రపోయాడు. దీన్ని జీర్ణించుకోలేక పోయిన ప్రియురాలు... ప్రియుడు నిద్రిస్తున్న ఇంటికి నిప్పు పెట్టింది. ఈ ఘటన అమెరికాలోని న్యూజెర్సీలో చోటుచేసుకుంది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, న్యూజెర్సీలోని వుడ్ బరీలో తైజా రస్సెల్(29) అనే యువతికి ఓ యువకుడు పరిచయమయ్యాడు. ఆ తర్వాత వారిద్దరూ చాలా సన్నిహితంగా మారారు. ఈ క్రమంలో ఎంజాయ్ చేసేందుకు తన ఇంటికి రావాలని ఆ యువకుడు ప్రతిపాదన తెచ్చాడు. దీనికి ఆ యువతి సమ్మతించి, ఎంతో ఆశగా ఇంటికి వచ్చింది. 
 
కానీ, ఆ యువకుడు మాత్రం అప్పటికే పూటుగా మద్యం సేవించి గాఢ నిద్రలోకి జారుకున్నాడు. ఇంటి దగ్గరకు వచ్చిన రస్సెల్ 8 సార్లు ఫోన్ చేసింది. రెండు సార్లు సందేశాలు పంపింది. అయినా యువకుడు గుర్రుపెట్టి నిద్రపోయాడు. దీంతో సహనం కోల్పోయిన రస్సెల్ దగ్గర్లోని ఓ పెట్రోల్ బంక్‌కు వెళ్లి, ఓ బాటిల్ నిండా పెట్రోల్‌తో పాటు అగ్గిపెట్టె, లైటర్‌ను కొనుగోలు చేసింది. 
 
నేరుగా యువకుడు నిద్రిస్తున్న ఇంటికి వచ్చి ఇంటిపై చల్లి నిప్పు పెట్టి అక్కడ నుంచి పారిపోయింది. అయితే మంటల వేడికి ఉదయం 4.30 గంటల సమయంలో మేలుకున్న యువకుడు కిటికీని పగులగొట్టి ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ సందర్భంగా అతనికి కాలిన గాయాలు అయ్యాయి. 
 
ఈ ఘటనలో యువకుడి ఇల్లు పూర్తిగా ధ్వంసం కాగా, అగ్నిమాపక సిబ్బంది ఇంట్లోని శునకాన్ని కాపాడారు. ఈ ఘటనకు సంబంధించి రస్సెల్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు, హత్యాయత్నంతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు.