గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 19 ఫిబ్రవరి 2019 (14:18 IST)

యుద్ధానికి మేం సిద్ధం... పుల్వామా దాడిలో మా హస్తం లేదు : ఇమ్రాన్ ఖాన్

పుల్వామా ఉగ్రదాడికి తమకు ఎలాంటి సంబంధం లేదని పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ స్పష్టంచేశారు. కానీ ఒక దేశంపై, జాతిపై అన్యాయంగా ఎలా ముద్రవేస్తారని ఆయన ప్రశ్నించారు. అదేసమయంలో తమపై యుద్ధం ప్రకటిస్తే తాము కూడా సిద్ధంగా ఉన్నట్టు ఆయన ప్రకటించారు. 
 
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పుల్వామా ఉగ్రదాడిలో 49 మంది భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడి జరిగిన నాలుగు రోజుల తర్వాత ఆయన మీడియాతో ముందుకు వచ్చారు. పుల్వామా దాడితో మాకు ఎలాంటి సంబంధం లేదన్నారు. 
 
ఒక దేశం అలా చేసింది.. ఇలా చేసింది అని మరో దేశం ఎలా చెప్పగలుగుతుందన్నారు. పదేపదే పాకిస్థాన్‌పై ఎందుకు నిందలు వేస్తున్నారంటూ ప్రశ్నించారు. సరిహద్దుల్లో ఇపుడిపుడే శాంతి సామరస్యాలు నెలకొంటున్నాయన్నారు. 
 
యుద్ధం ప్రకటించడం, ప్రారంభించడం సులభమే, కానీ ఆ తర్వాత జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో మాకు తెలియదన్నారు. తమపై ఎలాంటి దాడి జరిగినా దాన్ని తిప్పికొట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. భారత్ తమపై యుద్ధం ప్రకటిస్తే తాము కూడా యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వెల్లడించారు.
 
కాగా, పుల్వామా ఉగ్రదాడి తర్వాత పాక్‌పై భారత్ గుర్రుగా ఉన్న విషయం తెల్సిందే. ముఖ్యంగా, అంతర్జాతీయంగా పాకిస్థాన్ ఏకాకి చేసేందుకు భారత్ ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తోంది. ఇందులోభాగంగా, ఇప్పటికే అనేక ఆర్థిక ఆంక్షలు విధించింది.