మంగళవారం, 30 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 15 ఫిబ్రవరి 2021 (12:41 IST)

ఫలిస్తున్న చర్చలు... సరిహద్దుల నుంచి బలగాలు వెనక్కి

భారత్, చైనా దేశాల మధ్య జరుగుతున్న చర్చలు ఫలితాన్నిస్తున్నాయి. దీంతో సరిహద్దుల నుంచి ఇరు దేశాలకు చెందిన సైనికులు అనుకున్న సమయం కంటే ముదుగానే వెనుదిరుగుతున్నాయి. 
 
ఇటీవలి కాలంలో చైనా, భారత్ దేశాల మధ్య సరిహద్దు ఉద్రిక్తలు నెలకొన్న విషయం తెల్సిందే. ఈ ఉద్రిక్తతలు యుద్ధవాతావరణం కల్పించాయి. ఇరు దేశాలు సరిహద్దుల్లో భారీ సంఖ్యలో సైనిక బలగాలను మొహరించాయి. ఈ క్రమంలో ఇరు దేశాల సైనికాధికారుల మధ్య చర్చలు జరుగుతున్నాయి. వీటి ఫలితంగా సరిహద్దుల వెంబడి ఉన్న సైనికబలగాలను వెనక్కు తరలించాలని నిర్ణయించాయి. 
 
ఈ ప్రక్రియ అనుకున్న సమయంకన్నా, ముందుగా, వేగంగా సాగుతోందని సమాచారం. సరిహద్దుల నుంచి సైనికులు వెనక్కు మళ్లుతున్న అంశాన్ని అత్యంత నిశితంగా పరిశీలిస్తున్నామని, ముఖ్యంగా పాంగ్యాంగ్ సరస్సు ప్రాంతం నుంచి సైన్యం తొలగింపు ప్రక్రియ సాగుతోందని అధికారులు తెలిపారు. ఇరు దేశాల మధ్యా ఈ దిశగా లిఖితపూర్వక ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే.
 
"సైన్యాన్ని వెనక్కు తీసుకునే ప్రక్రియ రెండు వైపులా సాగుతోంది. ఇది అనుకున్న సమయం కన్నా ముందుగానే జరుగుతోంది. ఈ నెల 20 నాటికి తొలి దశ తరలింపు పూర్తవుతుందని అంచనా వేస్తున్నాం" అని సైన్యాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. గతంలో చైనా సైనికాధికారులతో జరిపిన చర్చల్లో ప్రతిష్ఠంభన ఏర్పడిన వేళ, మలి విడత చర్చల్లో లిఖిత పూర్వక డీల్ కుదరాల్సిందేనని ఇండియా పట్టుబడింది.
 
సరిహద్దుల్లో మోహరించిన హెలికాప్టర్లు, నిఘా డ్రోన్లు తదితర ఎలక్ట్రానిక్ పరికరాలు, సైన్యాన్ని సరిహద్దుల నుంచి 10 కిలోమీటర్ల దూరం వరకూ వెళ్లిపోవాలని రెండు దేశాలూ నిర్ణయించుకున్నాయి. ఒప్పందం కుదిరిన 48 గంటల్లోగా సైనికుల తరలింపు ప్రారంభం కావాలని డీల్ కుదరగా, పెట్రోలింగ్ పాయింట్స్ 15, 17, హాట్ స్ప్రింగ్స్ తో పాటు అత్యంత సమస్యాత్మక ప్రాంతమైన గోగ్రా ప్రాంతం నుంచి కూడా సైనికుల తరలింపు ప్రారంభమైందని ఉన్నతాధికారులు వెల్లడించారు.