శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సందీప్
Last Updated : బుధవారం, 20 ఫిబ్రవరి 2019 (13:01 IST)

భార్య నుదుటపై కాల్చిన ఎన్నారై భర్త... తాను గుండెల్లో బుల్లెట్ దించుకున్నాడు..

ఆమెరికాలో ఎన్నారై భార్యను చంపి తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోయిన ఈ తెలుగు దంపతులు శ్రీనివాస్‌, శాంతిలు. అతను తుపాకీతో కాల్చుకుని, భార్యను కూడా కాల్చి చంపేశాడు. టెక్సాస్‌లోని షుగర్‌ల్యాండ్‌లో దారుణం జరిగింది. 
 
వీరికి పాతికేళ్ల క్రితం వివాహం అయింది. వీరికి 21 ఏళ్ల కొడుకు, 16 ఏళ్ల కుమార్తె ఉంది. శ్రీనివాస్‌ హైదరాబాద్‌ జేఎన్‌టీయూలో మెకానికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేయగా, శాంతి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఇంజినీరింగ్‌ చదివారు. ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లి ఒకే యూనివర్సీటీలో చదువుకున్నారు. శ్రీనివాస్‌ టెక్సాస్‌లోని ఆర్‌ఆర్‌ఐ ఎనర్జీలో సంచాలకుడిగా పనిచేశాడు. టెక్సాస్‌లోనే వారిద్దరికీ పరిచయం ఏర్పడింది. పెళ్లి చేసుకుని అక్కడే స్థిర పడ్డారు. 
 
టెక్సాస్‌ కాలమానం ప్రకారం సోమవారం సాయంత్రం 6.30 గంటలకు వారి ఇంట్లో నుండి తుపాకీ ప్రేలుడు శబ్దం వినరావడంతో పోలీసులు అక్కడకు వెళ్లారు. తలపు తట్టి పిలవగా కుమార్తె తలుపు తెరిచింది. లోపలికి వెళ్లి చూసిన పోలీసులు రెండు మృత దేహాలను కనుగొన్నారు. భర్తకు గుండెలో బుల్లెట్ దూసుకుపోగా, ఆమెకు తలలో గాయం అయింది. 
 
ఈ విషయం గురించి కుమార్తెను అడగగా, తాను నిద్రపోతున్నప్పుడు ఈ సంఘటన జరిగిందని, పెద్ద శబ్దం వినరావడంతో లేచి వెళ్లి చూసానని చెప్పింది. వారి కొడుకు ఘటనా సమయంలో టెక్సాస్ యూనివర్సిటీలో క్లాసులకు వెళ్లి ఉన్నాడు. కుటుంబ కలహాలే వీరి చావుకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. పొరుగువారిని, స్నేహితులను విచారించగా వారు చాలా మంచి వారని, స్వచ్ఛంద సంస్థలకు కూడా సహాయం చేస్తుంటారని చెప్పారు. 
 
ఘటనకు ఒక గంట ముందు, ఐదు గంటల ప్రాంతంలో తమకు శ్రీనివాస్‌ నుంచి మెయిల్‌ వచ్చిందని ఆయన స్నేహితులు మీడియాకు చెప్పారు. కానీ దానిలో చావు గురించి ప్రస్తావించలేదని చెప్పారు. దానిలోని విషయాలను గోప్యంగా ఉంచమని పోలీసులు వారిని అభ్యర్థించారు. వారి మధ్య గొడవ ఉన్నట్లు పోలీసులు ఇదివరకూ ఎప్పుడూ ఫిర్యాదు అందుకోలేదని చెప్పారు. విచారణ జరిపి కారణాలు బయటకు తీయాలని పేర్కొన్నారు. ఇది బయట వారి పని కాదని. చుట్టు ప్రక్కల వారు భయపడాల్సిన పని లేదని చెప్పారు.