శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : సోమవారం, 16 సెప్టెంబరు 2019 (12:51 IST)

యుద్ధంలో ఓడిపోతాం.. కానీ అణు యుద్ధం తప్పదు : ఇమ్రాన్ ఖాన్ (video)

భారత్‌తో సంప్రదాయ యుద్ధమంటూ జరిగితే ఓడిపోవడం ఖాయమనీ, కానీ అణు యుద్ధం తప్పదని పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ అభిప్రాయపడ్డారు. ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇచ్చారు. ఇందులో భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య నెలకొన్న పరిస్థితులపై స్పందించారు. 
 
ప్రస్తుత పరిస్థితుల్లో భారత్‌తో యుద్ధం జరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయన్నారు. అణ్వాయుధ సామర్థ్యం ఉన్న రెండు దేశాల మధ్య సంప్రదాయ యుద్ధం మొదలైనప్పుడు.. చివరికి అది అణుయుద్ధంతో ముగుస్తుందన్నారు. ఇమ్రాన్ ఓవైపు అణు యుద్ధ వ్యాఖ్యలు చేస్తూనే మరోవైపు తనను తాను శాంతికాముకుడిగా అభివర్ణించుకున్నారు.
 
తాను యుద్ధానికి వ్యతిరేకమని చెబుతూనే, పాకిస్థాన్ ఎప్పుడూ యుద్ధాన్ని మొదలుపెట్టదని, ఏ సమస్యకూ యుద్ధం పరిష్కారం కాదన్నారు. జమ్ముకాశ్మీర్‌లో శాంతిని కొనసాగించేందుకే తాము సమస్యను అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. తాము శాంతి చర్చల కోసం ప్రయత్నిస్తుంటే భారత ప్రభుత్వం తమను ఆర్థికంగా దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. 
 
కాగా, ఆర్టికల్ 370 రద్దు అంశంలో భారత్‌ను అంతర్జాతీయంగా బదనాం చేసేందుకు ఎంత ప్రయత్నించినా ప్రపంచ దేశాలు పట్టించుకోకపోవడంతో పాకిస్థాన్ నేతల్లో అసహనం పెరిగిపోతున్న విషయం తెల్సిందే. ముఖ్యంగా పాక్ ప్రధాని తరుచూ అణుయుద్ధం తప్పదని బీరాలు పలుకుతున్నారు. ఇమ్రాన్‌ఖాన్ అల్‌జజీరా చానెల్‌కు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ ఇదే విషయాన్ని ఆయన ప్రస్తావించారు.