1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 14 ఆగస్టు 2017 (09:39 IST)

అమెరికా - ఉ.కొరియాల మధ్య కమ్ముకుంటున్న యుద్ధమేఘాలు.. ఎనీటైమ్ బాంబుల వర్షం

అమెరికా, ఉత్తర కొరియా దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఈ ఇరుదేశాధినేతల మాటలతీరు చూస్తుంటే ఈ రెండు దేశాల మధ్య యుద్ధం తప్పదని తేలిపోయింది. పైగా, ఏ క్షణమైనా ఇరు దేశాలు ఒకరిపై ఒకరు బాంబుల వర్షం క

అమెరికా, ఉత్తర కొరియా దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఈ ఇరుదేశాధినేతల మాటలతీరు చూస్తుంటే ఈ రెండు దేశాల మధ్య యుద్ధం తప్పదని తేలిపోయింది. పైగా, ఏ క్షణమైనా ఇరు దేశాలు ఒకరిపై ఒకరు బాంబుల వర్షం కురిపించుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. 
 
ముఖ్యంగా గత రెండు రోజులుగా ఇరు దేశాధినేతల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లతో మాటల యుద్ధం జరుగుతోంది. ఈ రాత్రికే యుద్ధం ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నామంటూ అమెరికా రక్షణ శాఖ హెచ్చరించింది. తుపాకులకు లాకులు వేసి మందుగుండు లోడు చేశామంటూ. సాక్షాత్తూ అగ్రరాజ్యాధిపతే హెచ్చరించారు. 
 
అమెరికా, దాని మిత్రుల భూభాగంపై కన్నేస్తే కఠిన చర్యలు తప్పవని డోనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ పశ్చాత్తాప పడాల్సి వస్తుందని ప్రకటించారు. ఉత్తర కొరియా తెలివి తక్కువతనంతో వ్యవహరిస్తే సైనికపర పరిష్కారమే మార్గమన్నారు. కొరియాతో దొడ్డిదారిన సంప్రదింపులు జరిపే ప్రసక్తేలేదని ట్రంప్ తేల్చి చెప్పేశారు.
 
మరోవైపు అమెరికా ఎన్ని ఘాటు హెచ్చరికలు చేస్తున్నా డోన్ట్ కేర్ అంటున్నారు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్. పైగా మరో క్షిపణి ప్రయోగానికి సిద్ధమవుతున్నారు. జలాంతర్గామి ఆధారిత బాలిస్టిక్‌ క్షిపణి ప్రయోగాలు చేపడతామని ఉత్తర కొరియా టీవీ ప్రకటించింది. అమెరికాకు వ్యతిరేకంగా పోరాడేందుకు సైన్యంలో చేరుతామంటూ 30 లక్షలమంది స్వచ్ఛందంగా ముందుకొచ్చారని తెలిపింది.
 
దీంతో అమెరికా - ఉత్తర కొరియా మధ్య సంబంధాలు పూర్తిగా క్షీణించాయి. గ్వామ్‌ దీవిలో అమెరికా సూపర్‌సోనిక్‌ బి-1 బాంబులను సిద్ధం చేసింది. అమెరికా వైమానిక దళానికి ఈ బాంబులు వెన్నెముకలాంటివి. దీన్నే లక్ష్యంగా చేసుకుని ఉత్తర కొరియా కయ్యానికి కాలుదువ్వుతోంది. పైగా, తమ తొలి లక్ష్యం కూడా గ్వామ్ దీవి అని కింజ్ జాంగ్ ఉన్ ప్రకటించిన విషయం తెల్సిందే.