గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సందీప్
Last Updated : గురువారం, 14 ఫిబ్రవరి 2019 (12:55 IST)

కన్నబిడ్డ అన్నం తినలేదని.. మెట్ల నుంచి తన్నేసింది.. ఏడ్చి ఏడ్చి ఉయ్యాలలోనే?

పిల్లలు అన్నం తినకపోతే తల్లులు బుజ్జగించి తినిపిస్తారు కానీ ఓ తల్లి గోరుముద్దలు తినలేదని కిరాతకంగా మారింది. కుమారుడిని తీవ్రంగా కొట్టింది. తీవ్ర గాయాలై చనిపోవడంతో పోలీసులను తప్పుదోవపట్టించాలని ప్రయత్నించింది. న్యూజెర్సీకి చెందిన నకీరా గ్రైనర్ తన పిల్లాడు ఆహారం తినలేదని, చెప్పిన మాట వినలేదని కుక్కను కొట్టినట్లు కొట్టింది. 
 
మెట్లపై ఉన్న బాబుని తంతే ఒకటవ అంతస్తుపై నుండి దొర్లుకుంటూ క్రింద పడ్డాడు. ఆ బాలుడికి ముఖాన తీవ్ర గాయాలు అయ్యి ఏడుస్తుంటే కూడా హృదయం కరగలేదు. గుక్కపట్టి ఏడుస్తున్న పిల్లవాడిని ఉయ్యాలలో పడేసి వెళ్లిపోయింది. ఇంతకీ ఆ బాలుడి వయస్సు 23 నెలలు మాత్రమే. రెండేళ్లు కూడా లేని ఆ బాలుడు ఏడ్చి ఏడ్చి ఉయ్యాలలోనే చనిపోయాడు. 
 
కొద్దిసేపటికి ఏడుపు వినపడకపోవడంతో నకీరా అక్కడికి తిరిగి వచ్చింది. చనిపోయి పడి ఉన్న పిల్లాడిని భయపడిపోయింది. శవాన్ని తీసుకువెళ్లి పెరటిలో కిరోసిన్ పోసి నిప్పంటించి దహనం చేసింది. ఆ బూడిదను అక్కడే పాతిపెట్టింది. చట్టం నుండి తప్పించుకోవడానికి మరో ఎత్తు వేసింది. నెట్టుకుంటూ వెళ్లే ఉయ్యాలలో పిల్లాడి బూట్లు వేసి ఇంటికి కొద్ది దూరంలో విడిచిపెట్టింది. 
 
పోలీసులకు ఫోన్ చేసి, బాబును బయటకు తీసుకువెళుతుండగా కొందరు దుండగులు వారిపై దాడి చేసి పిల్లాడిని ఎత్తుకు వెళ్లిపోయారని ఫిర్యాదు చేసింది. తనపై కూడా దాడికి దిగినట్లు చెప్పింది. పిల్లాడి కోసం గాలింపులు మొదలు పెట్టిన పోలీసు జాగిలాలు నకీరా ఇంటి దగ్గర తోటలో ఆనవాళ్లు కనుగొన్నాయి. దాంతో పోలీసులు నకీరాను అదుపులోకి తీసుకుని విచారించారు. ఆమె అసలు నిజం బయటపెట్టింది. ఇప్పుడు కోర్టులో హాజరుపరచనున్నారు.