శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ముఖాముఖి
Written By DV
Last Modified: గురువారం, 14 జులై 2016 (21:36 IST)

'చెప్పను బ్రదర్' డైలాగ్‌తో ఎవ్వరినీ కించపరచలేదు : అల్లరి నరేష్‌ ఇంటర్వ్యూ

అల్లరి నరేష్‌ 'సుడిగాడు' తర్వాత అంత సక్సెస్‌ రాలేదు. అందుకే కొన్నాళ్ళు సినిమాలకు దూరంగా వున్న నరేష్‌.. ఈసారి ఏకండా మూడు చిత్రాల్లో బిజీగా వున్నాడు. సెల్ఫీరాజా తర్వాత రెండు చిత్రాలు జరుగుతున్నాయి. మూడో చిత్రం నవంబర్‌లో వుంటుందని చెబుతున్నారు. అయితే '

అల్లరి నరేష్‌ 'సుడిగాడు' తర్వాత  అంత సక్సెస్‌ రాలేదు. అందుకే కొన్నాళ్ళు సినిమాలకు దూరంగా వున్న నరేష్‌.. ఈసారి ఏకండా మూడు చిత్రాల్లో బిజీగా వున్నాడు. సెల్ఫీరాజా తర్వాత రెండు చిత్రాలు జరుగుతున్నాయి. మూడో చిత్రం నవంబర్‌లో వుంటుందని చెబుతున్నారు. అయితే 'సెల్ఫీరాజా' చిత్ర ట్రైలర్‌లో 'చెప్పను బ్రదర్‌'.. అనే డైలాగ్‌ను ఎవ్వరినీ కించపరచడానికి పెట్టలేదని.. తనకు అల్లు అర్జున్‌ మంచి స్నేహితుడనీ, పవన్‌ కళ్యాణ్‌ అంటే గౌరవమని.. అల్లరి నరేష్‌ తెలియజేశారు. సెల్ఫీరాజా.. శుక్రవారమే విడుదలవుతుంది. ఈ సందర్భంగా ఆయనతో జరిపిన ఇంటర్వ్యూ.
 
ట్రైలర్‌తో అంతటా 'చెప్పను బ్రదర్‌' డైలాగ్‌ను మళ్ళీ గుర్తు చేశారు. అది కావాలనే పెట్టిన డైలాగా?
ట్రైలర్‌లో అన్ని పంచ్‌లు ఉన్నా, ఆ ఒక్క డైలాగే ఎలా ఫేమస్‌ అయిందో అర్థం కావట్లేదు. ఆ డైలాగ్‌ ఏదో వివాదం సృష్టించాలని పెట్టింది కాదు. సరదాగా నవ్వుకోవడానికే అలా పెట్టాం. బన్నీ నాకు మంచి ఫ్రెండ్‌. పవన్‌ కళ్యాణ్‌ గారిని కూడా నేను చాలా గౌరవిస్తాను. ఎవరినో కించపరచడానికో, గొడవ పెట్టడానికో ఆ డైలాగ్‌ పెట్టలేదు. సినిమా చూశాక మీరూ అదే చెప్తారు. బన్నీ సినిమా చూసినా కూడా ఆ డైలాగ్‌కు సరదాగా నవ్వుకుంటాడనే అనుకుంటున్నా.
 
టైటిల్‌ వెనుక కథేంటీ?
నా సినిమా టైటిల్స్‌ విషయంలో, వినగానే అందులో ఫన్‌ కనిపించాలనే ముద్ర పడిపోయింది. ఈ సినిమాలో నేను సమయం, సందర్భం లేకుండా సెల్ఫీలు తీసుకునే పాత్రలో కనిపించా. అందుకు సరిగ్గా కుదురుతుందని, కొత్తగా కూడా ఉందని టైటిల్‌ పెట్టాం. టైటిల్‌ విడుదల చేయడం కూడా విజయ్‌ మాల్యాతో నేను సెల్ఫీ దిగినట్టు ఫోటోషాప్‌ చేసి పెట్టాం. మేము టైటిల్‌ ప్రకటించిన రోజునుంచే సినిమాపై మంచి అంచనాలు పెరిగాయి.
 
మీకు సెల్ఫీ అంటే ఇష్టమేనా?
నేనస్సలు తీసుకోను.
 
ఈ సినిమా మీ కెరీర్‌కు ఎలా వుపయోగపడుతుంది?
సుడిగాడు తర్వాత ఏ సినిమాలోనూ స్పూఫ్‌లు చేయలేదు. ఈ సినిమాలో ఒక్క స్పూఫ్‌ వుంటుంది. నా నుంచి కామెడీనే ఆశిస్తున్నారు. కాబట్టే నా కెరీరకు హెల్ప్‌ అవుతుందనుకుంటున్నా.
 
ఇటీవల విజయాలు తగ్గాయి. దాన్ని ఎలా స్వీకరిస్తున్నారు?
ప్రతిసారీ నా సినిమాలు ఒకేలా అయిపోతున్నాయని కొత్తగా ప్రయత్నించా. 'బ్రదర్‌ ఆఫ్‌ బొమ్మాళి', 'జేమ్స్‌బాండ్‌' సినిమాల్లో హీరోయిన్‌కి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం కానీ, 'బందిపోటు', 'లడ్డుబాబు' లాంటి క్లాస్‌ సినిమాలు కానీ.. అన్నీ కొత్తదనం కోసమే చేశా. అవి ఎక్కడో సరిగ్గా కుదరక బాగా ఆడలేదు. ఆ నిర్ణయాలన్నీ స్వతహాగా నేను తీసుకున్నవే కాబట్టి ఆ విషయంలో అసంతృప్తి లేదు.
 
హీరోలందరూ కామెడీ చేసేస్తున్నారు. మీ మార్కెట్‌కు ఇబ్బందిగా భావించడం లేదా?
లేదు. నిజం చెప్పాలంటే ప్రతీ సినిమాలో కామెడీ అనేది కచ్చితమైన అంశంగా మారిపోయింది. మన హీరోలందరూ అది ఏ సినిమా అయినా అందులో కొంత కామెడీ ఉండేలా చూసుకుంటున్నారు. అయితే ఆ తరహా కామెడీకి, నేను చేసే పూర్తిస్థాయి కామెడీకి తేడా ఉంది. అందువల్ల నా మార్కెట్‌కు ఇబ్బందని అనుకోను. అయినా హీరోలే స్వయంగా కామెడీ చేయడమన్నది ఆహ్వానించదగ్గ పరిణామం.
 
తక్కువ సంఖ్యలో సినిమా చేస్తున్నారు కారణం?
తక్కువ సినిమాలు చేస్తున్నానంటే హిట్స్‌ లేకపోవడం వల్లనే. ఇప్పుడు ఎంత హీరోకైనా ప్రతీ సినిమా కొత్త సినిమాలాగే మారిపోయింది. ఫ్లాప్‌లో ఉన్నప్పుడు జాగ్రత్తగా సినిమాలు ఎంపిక చేసుకోవాలి. అదే ఇప్పుడు ఫాలో అవుతున్నా. అంతేకాకుండా ఒకేసారి రెండుమూడు సినిమాలు లైన్లో పెట్టడం నిర్మాతలకు కూడా అసౌకర్యంగా ఉంటుందనే ఇలా ఒక సినిమా తర్వాత మరొకటి చేస్తూ వెళుతున్నా.
 
మీ నాన్నగారి సినిమాలు రీమేక్‌ చేస్తున్నారా?
ఆలోచన వుంది. 'ఆ ఒక్కటీ అడక్కు'.. రీమేక్‌ చేయాలనుకుంటున్నాం. దానికి 'ఆ ఒక్కటీ అడుగుతా' పేరు పెట్టనున్నాం. రాజేంద్రప్రసాద్‌ మామగా, నేను అల్లుడిగా, రంభ అత్తగా నటించాలనే ఆలోచన వుంది.
 
తదుపరి సినిమాలు?
ప్రస్తుతానికి రెండు సినిమాలు ఒప్పుకున్నా. జి. నాగేశ్వర్‌ రెడ్డి దర్శకత్వంలో 'ఇంట్లో దయ్యం నాకేంటి భయం' అనే హర్రర్‌ కామెడీ చేస్తున్నా. అదేవిధంగా 'అలా ఎలా' సినిమా డైరెక్టర్‌ అనీష్‌ కృష్ణతో 'మేడ మీద అబ్బాయి' అనే మరో సినిమా కూడా లైన్లో ఉంది. ఈ రెండూ కాకుండా సముద్రఖని దర్శకత్వంలో ఓ సీరియస్‌ సినిమా నవంబర్‌లో మొదలవుతుంది.
 
సొంత బ్యానర్‌లో ఎప్పుడు?
సొంత బ్యానర్‌లో ఒక సినిమాను ప్లాన్‌ చేశా. దాని గురించి అధికారికంగా త్వరలోనే ప్రకటిస్తా.
 
దర్శకుడిగా కూడా మారనున్నారని వినిపిస్తోంది?
దర్శకత్వం గురించి ఇప్పుడే ఏం ఆలోచించట్లేదు. ఒక రెండు, మూడేళ్ళ తర్వాత, మా సొంత బ్యానర్‌లోనే ఓ సినిమా డైరెక్ట్‌ చేస్తా అని చెప్పారు.