సంగీత దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని పొందిన దేవీశ్రీప్రసాద్.. డిఎస్పి..గా విదేశీయులకు పరిచయం. ఆయన చేసిన ప్రతి షో విశేష ఆదరణ పొందుతుంది. ఇటీవలే ఆయన నాటా సభలకు వెళ్ళి అక్కడ పలు సిటీల్లో ప్రోగ్రావమ్లు చేశారు. అక్కడ విజయవంతమైన ఉత్సాహంతో మరిన్ని సినిమాలు చేయడానికి ప్రోగ్రామ్లు చేయడానికి బలం వచ్చిందంటున్నారు. 'నాటా 2014' సభల్లో భాగంగా యుఎస్ఏ, బే ఏరియా, న్యూజెర్సీ, చికాగో తదితర ప్రాంతాల్లో విజయవంతంగా మ్యూజిక్ షోలను ముగించుకొని ఇటీవల హైదరాబాద్ వచ్చి తన పనుల్లో నిమగ్నమైన దేవిశ్రీ ప్రసాద్తో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు.
విదేశీ షోలు నిర్వహణ ఎలా అనిపించింది?
సినిమాలకు సంగీతమందించడంతోపాటు ప్రత్యేకమైన షోలు చేయడం నాకున్న పేషన్. దానికి నా ఒక్కడికే పేషన్ ఉంటే చాలదు. ఆ కార్యక్రమాన్ని సక్రమంగా చేయగలిగే ఆర్గనైజర్ కావాలి. అటువంటి వ్యక్తులు దొరికితేనే ముందుకెళ్ళాలని ముందే ఫిక్స్ అయ్యాను. తిరుమలరెడ్డిగారు నాకు దొరికిన చక్కని ఆర్గనైజర్. అలాగే రేడియో ఖుషి వారు కూడా ఎంతగానో సహకరించారు. నేను తీసుకెళ్లిన మ్యూజిషియన్లు, అక్కడ నాకు సహకరించిన గిటారిస్ట్లు, జాజ్ వయోలినిస్ట్ల వల్లే సక్సెస్ఫుల్గా షో ఫినిష్ చేయగలిగాను.
నూతన టెక్నాలజీతో, నాలుగు నెలల ముందే ప్రణాళిక వేసుకుని 100పర్సెంట్ సక్సెస్ చేయాలని ఫిక్స్ అయ్యాం. ఈరోజు మాఅమ్మ పుట్టినరోజు సందర్భంగా షో తాలుక వివరాల్ని, ఆ ఆనందాన్ని మీడియాతో, పంచుకోవడం ఆనందంగా ఉంది.
మైఖేల్పై ఓ సాంగ్ ఎంతవరకు వచ్చింది?
చికాగోలో జూలై 26న జరిగిన షో గురించి అక్కడి గవర్నర్ ఆ రోజును 'డిఎస్పి డే'గా ప్రకటించి గౌరవించడంతో చాలా సంతోషించాను. అందుకు తెలుగువాడిగా చాలా గర్వపడ్డాను. అలాగే నా పుట్టినరోజున నాకిష్టమైన మైఖేల్ జాక్సన్పై ఓ గిటార్ సాంగ్ చేశాను. 'జల్సా ఎమ్జె' అంటూ సాగే ఆ పాటను 28వ తేది నైట్ లాంచ్ చేస్తాం. ఆ పాటను మైఖేల్ జాక్సన్కి అంకితమివ్వబోతున్నాను.
సంగీత దర్శకునిగా కెరీర్ విశ్లేషిస్తే ఎలా అనిపిస్తుంది?
ఆనందం సినిమా నుండి నేటి వరకు నా పాటల్ని వేదికపై పెర్ఫార్మ్ చేస్తుంటే కొత్త అనుభూతి కలిగింది. ఆ పాటలకు లిరిక్స్ రాసిన సిరివెన్నెలగారు, చంద్రబోస్, రామజోగయ్య శాస్త్రి వంటి గేయరచయితల మీద మరింత గౌరవం, ప్రేమ పెరిగాయి. ఈ షో కార్యక్రమాలు ప్రారంభించినప్పటి నుండి అంతా పాజిటివ్గా ఉంది. యుఎస్లో ఉండగా అత్తారింటికి దారేది చిత్రానికి ఫిలిం ఫేర్ అవార్డ్ వచ్చింది. అల్లుడు శ్రీను ఆడియో, సినిమా పెద్ద హిట్టయ్యాయి. అక్కడి నుండి రాగానే 5 మిర్చి మ్యూజిక్ అవార్డ్లొచ్చాయి. త్వరలో సంతోషం అవార్డ్ కూడా అందుకోబోతున్నాను.
పవన్ కళ్యాణ్ ప్రోత్సాహం ఎలా వుంది?
ఈ షో అనుకోగానే త్రివిక్రమ్గారు ఎంతో ప్రోత్సాహించారు. పవన్ కళ్యాణ్గారితో ఫస్ట్ ప్రొమో రిలీజ్ చేయించింది ఆయనే. అలాగే మహేష్ బాబుగారు కూడా స్పెషల్ బైట్స్ ఇచ్చారు. తమిళ ప్రొమోని, పోస్టర్ని కమల్ హాసన్, విజయ్లు విడుదల చేశారు. నేను పని చేస్తున్న ప్రతి సినిమా దర్శకనిర్మాతలు ఈ షోలు చేయమని నన్ను ఎంకరేజ్ చేశారు. వేలమంది జనాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహించడం వల్ల నాలో మరింత కిక్ పెరిగింది. ఇప్పుడు చేయబోతున్న సినిమాలకు 3 రోజుల్లో చేయాల్సిన పనిని ఒక రోజులో చేయగల హుషారొచ్చింది. ఈసారి ఆస్ట్రేలియా, లండన్, దుబాయ్, మలేషియా, సింగపూర్ ప్రాంతాల్లో షోలు చేయడానికి ప్లాన్ చేస్తాను.
హిందీ 'కిక్' చేయకపోవడానికి కారణం?
సల్మాన్ఖాన్ నటించిన కిక్ సినిమాకి మ్యూజిక్ చేయమని ఆయనే స్వయంగా ఫోన్ చేసి అడిగారు. అక్కడ ఒక్కోపాటకి ఒక్కో సంగీతం దర్శకుడు పనిచేస్తాడు. ఆ ఒరవడి నాకు నచ్చదు. అలాగే ఇక్కడ వరుస సినిమాలతో బిజీగా ఉండడంతో ఆయన మాటని సున్నితంగా తిరస్కరించాను.
కొత్తవారి ప్రోత్సాహం?
సంగీత రంగంలో మంచి అవగాహన ఉండి, తమ టాలెంట్ని బయటికి చూపలేకపోతున్న యువత ఎందరో మనలో ఉన్నారు. ఇటీవల అటువంటి యంగ్ టాలెంట్స్ని నేను కలిశాను. వారితో ఓ ఆల్బమ్ చేయించి వారి ప్రతిభను ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను.
తదుపరి చిత్రాలు?
పూరి-ఎన్టీఆర్, కొరటాల శివ-మహేష్బాబు, తమిళంలో విజయ్ నటిస్తున్న ఓ సినిమా, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ రెండో సినిమాకి మ్యూజిక్ ఇచ్చే పనిలో బిజీగా ఉన్నాను.
హీరోగా అప్పట్లో నటిస్తున్నారని అన్నారు?
చాలామంది హీరోగా యాక్ట్ చేయమని అడుగుతున్నారు.. ఈ బిజీ షెడ్యూల్లో హీరోగా చేయడం కష్టం. భవిష్యత్లో ఫ్రీగా వున్నప్పుడు తప్పకుండా చేస్తాను.
గాసిప్స్ విన్నప్పుడు ఎలా అనిపిస్తుంది?
ఆమధ్య రకరకాలుగా నాపై గాసిప్లు వచ్చాయి. పలు వెబ్సైట్లలో దాని గురించి పలు కథనాలు రాశారు. అవి చదివినపుడుకానీ, ఫ్రెండ్స్ ద్వారా తెలిసినప్పుడు కానీ నవ్వొస్తుంది. కానీ నా కారణంగా మరో అమ్మాయి పేరు బయటకు రావడం బాధ కల్గిస్తుంది.
పెళ్ళి చేసుకుంటున్నారనే వార్తలు వస్తున్నాయి?
ఇంకా అనుకోలేదు. పెళ్ళి ఫిక్స్ కాగానే... ముందు మీడియాకే చెబుతాను అని ముగించారు.