గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ముఖాముఖి
Written By DV
Last Modified: శనివారం, 30 ఏప్రియల్ 2016 (21:27 IST)

అది త్రివిక్రమ్‌నే అడగాలి... నటుడు సూర్య ఇంటర్య్యూ

భిన్నమైన కాన్సెప్ట్‌లతో ముందుకు వచ్చే నటుడు సూర్య. గజని, సెవెన్త్ సెన్స్‌ వంటి చిత్రాలతోనే కాకుండా సింగం వంటి ఎమోషనల్‌ చిత్రాల్లో నటించి మెప్పించాడు. ఈసారి సైన్స్‌ ఫిక్షన్‌ కథాంశంతో ముందుకు వస్తున్నాడు. తెలుగులో 'మనం' తీసిన విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వంలో ఆయన నటించాడు. ఎ.ఆర్‌.రెహమాన్‌ సంగీత సారధ్యంలో రూపొందుతోన్న సైన్స్ ఫిక్షన్‌ థ్రిల్లర్‌ '24'. ఈ చిత్రాన్ని గ్లోబల్‌ సినిమాస్‌, 2డి ఎంటర్‌టైన్‌మెంట్స్‌, శ్రేష్ట్‌ మూవీస్‌ కలయికలో స్టూడియో గ్రీన్‌ అధినేత కె.ఇ.జ్ఞానవేల్‌ రాజా సమర్పిస్తున్నారు. ఈ నెల 6న విడుదలవుతుంది. ఈ సందర్భంగా హీరో సూర్యతో ఇంటర్వ్యూ.
 
24 అనే అంకె పెట్టడానికి కారణం?
అందులోనే సీక్రెట్‌ వుంది. 75 కోట్ల ఖర్చు పెట్టి సినిమా తీశాం. ఆ మాత్రం క్యూరియాసిటీ వుండొద్దా. తెలుసుకోవాలంటే థియేటర్‌కు రావాల్సిందే. ఈ నెంబరుకూ కథకు లింక్‌ వుంది.
 
ఇంతకుముందు సైన్స్‌ ఫిక్షన్‌ చేశారు. ఇందులో తేడా ఏమిటి?
ఇది మూడోది. భిన్నమైన కంటెంట్‌ సినిమాలు చేయాలని అనుకుంటాను. అలా అని ఎవరినీ కించపరచడంలేదు. ఎన్నో కమర్షియల్‌ సినిమాలను చూస్తుంటాం. అన్నీ బ్లాక్‌‌బస్టర్‌ హిట్స్‌ సాధించి ఉంటాయి. అయితే సినిమా చూసిన తర్వాత ఆ ఫీల్‌ను ఎంతమంది ఇంటి వరకు క్యారీ చేస్తారు. తెలుగు సినిమా విషయానికి వస్తే శంకరాభరణం, బాహుబలి, ఈగ, మనం, రీసెంట్‌గా విడుదలైన 'ఊపిరి' ఇలాంటి సినిమాలు కూడా పెద్ద హిట్స్‌ సాధించాయి. 
 
ఈ చిత్రాలను మన పిల్లలు, ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి చూశాం. 'మనం' చాలా సినిమాలను చూస్తే అవి హద్దులను దాటి సినిమా అంటే ప్రాంతాలకు పరిమితం కావని రుజువు చేశాయి. ఆదిత్య 369, మిష్టర్‌ ఇండియా వంటి సినిమాల గురించి ఇప్పటికీ చెప్పుకుంటాం. అలాంటి కోవకు చెందిన సినిమాయే 24. గజినీ సినిమాలో నేనొక మతిమరుపు ఉన్న పెషెంట్‌ పాత్ర చేసినా, అందులో మంచి లవ్‌ స్టోరీ ఉంది. అది అందరికీ నచ్చింది. అలాంటి కంటెంట్‌తో, ఫ్యామిలీ సహా అందరూ చూసే సినిమా. 
 
మూడు పాత్రలు చేస్తూ నిర్మాత బాధ్యతలు ఎలా స్వీకరించారు?
సినిమాలో నటిస్తూ, నిర్మించడం అనే భావన చాలా హ్యపీగా, గర్వంగా అనిపించింది. కంటెంట్‌ అంత స్ట్రాంగ్‌ ఉంది. సినిమాను ఫుటేజ్‌ను రీరికార్డింగ్‌ లేకుండా చూశాను. రెహమాన్‌ బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ విన్నాను. నేనే కాదు, యూనిట్‌ అంతా ఫైనల్‌ కంటెంట్‌ చూసి గర్వంగా ఫీలయ్యాం. విక్రమ్‌ చెప్పిన దాని కంటే బాగా చేశాడనిపించింది. 
 
విక్రమ్‌ కె.కుమార్‌తో 'మనం' చేయాలనుకున్నారుగదా?
ముందుగా మనం రీమేక్‌ చేయాలనుకున్నా. ఆ తర్వాత నా మైండ్‌లో రెండు ఆలోచనలు మొదలయ్యాయి. మనం చిత్రాన్ని ఎందుకు రీమేక్‌ చేయాలి, కొత్త కథతో సినిమా చేయవచ్చు కదా, ఒకవేళ విక్రమ్‌ కలిస్తే 'మనం' కాకుండా కొత్త సినిమా కథ చెప్పమని అడిగాను. ఆయనా అందుకు ఓకే అన్నారు. అరగంట అపాయింట్‌‌మెంట్‌ తీసుకుని వచ్చిన విక్రమ్‌ నాలుగున్నర గంటల పాటు ఈ కథను కనీసం నీళ్లు కూడా తాగకుండా నెరేట్‌ చేశారు. అంతా విన్న తర్వాత నేను బాగా ఇంప్రెస్‌ అయ్యాను. కథ ఫాంటసీ అయినా, ఇండియన్‌ సినిమా. హాలీవుడ్‌ నుండి కాపీ కొట్టిన సినిమా కాదు. మంచి టీం కుదిరింది. ఇలాంటి సినిమాకు నిర్మాతగా ఉండటాన్ని ఎంజాయ్‌ చేశాను. క్రిష్‌ 3, బాజీరావు మస్తానీ వంటి సినిమాలకు పనిచేసిన మేకప్‌ మ్యాన్‌, మంచి ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ ఇలా బెస్ట్‌ టీం కుదిరింది. 
 
ముందుగానే రెండు భాషలు అనుకున్నారా?
ప్రేక్షకులు చాలా తెలివిగా ఆలోచిస్తున్నారు. ఎవరినీ మోసం చేయలేం. ట్రెండ్‌ సెట్‌ మూవీ చేశానని చెప్పను కానీ, కొత్త జోనర్‌లో ఒక కొత్త ప్రయత్నం చేశామని చెప్పగలను. అందుకే రెండు భాషల్లో చేయాలని అనుకున్నాం.
 
ఈ సినిమా పూర్తవ్వడానికి ఎన్ని రోజులు పట్టింది?
అందరూ రెండేళ్ల సమయం పట్టిందని అనుకుంటారు కానీ పక్కా ప్లానింగ్‌, మంచి టీం కుదరడంతో సినిమాను ఏడాది లోపే పూర్తి చేసేశాం. సినిమా చిత్రీకరణకు 115 రోజుల సమయం తీసుకున్నాం. మేకింగ్‌లో జ్యోతిక బ్రదర్‌ పూర్తి సహకారం అందించాడు. తను ప్రియదర్శన్‌, సంజయ్‌ లీలా బన్సాలీ, కరణ్‌ జోహార్‌ వంటి దర్శకుల వద్ద పనిచేయడంతో సినిమాపై మంచి అవగాహన ఉంది. బెస్ట్‌ టెక్నికల్‌ టీంను రూపొందేలా సపోర్ట్‌ చేశాడు. షెడ్యూల్‌ ప్లానింగ్‌ పక్కాగా చేయడంతో త్వరగానే పూర్తి చేసేశాం. 
 
తెలుగులో ఎప్పుడు డబ్బింగ్‌ చెబుతారు?
బ్రదర్స్‌, రక్తచరిత్ర.. సినిమాకు డబ్బింగ్‌ చెప్పాను కానీ అన్నీ సినిమాలకు తెలుగు డబ్బింగ్‌ చెప్పలేకపోతున్నాను. సాధారణంగా ఒక సినిమా నుండి మరో సినిమాకు వెళ్లడానికి ముందు ఒకటిన్నర నెల గ్యాప్‌ ఉంటుంది. అయితే ఆ గ్యాప్‌లో ఎడిటింగ్‌ వర్క్‌ పోస్ట్‌పోన్‌ కావడం, బ్యాక్‌ ల్యాగ్‌ ఏర్పడుతుంది. దాని వల్ల తెలుగు డబ్బింగ్‌ చెప్పడానికి సమయం దొరకడం లేదు. 
 
అగరం ఫౌండేషన్‌ కార్యకలాపాలు ఎలా వున్నాయి?
ఈ ఫౌండేషన్‌లో 1300 విద్యార్థులున్నారు. 1000 విద్యార్థులు చదువు పూర్తి చేసుకుని బయటకు వెళతున్నారు. అందరూ స్వచ్చదంగా సపోర్ట్‌ చేస్తున్నారు. మా ఫౌండేషన్‌ ద్వారా 'యాదుం వూరే' అనే మ్యాగజైన్‌ స్టార్ట్‌ చేశాను. దీని ద్వారా ప్రజల్లో మన పరిసరాల, వాతావరణం గురించి అవగాహన కల్పిస్తాను. ఈ మ్యాగజైన్‌కు నేనే ఎడిటర్‌గా ఉన్నాను. నేను నా పిల్లలకు అవగాహన కల్పిస్తున్నాను. ప్లాస్టిక్‌ సంచులు వాడవద్దని, దాని వల్ల కలిగే నష్టాలను వివరించాను. ఇప్పుడు మా అమ్మాయి ప్లాస్టిక్‌ సంచులను వాడటం లేదు. నా స్టాఫ్‌ను కూడా గుడ్డ సంచులనే వాడమని అంటుంది. నా ఇంట్లోనే మార్పు కనపడుతుంది. ఇలా నీటి వాడకం అవగాహన పెంచుతున్నాం. 
 
కమల్‌ను ఫాలో చేస్తానన్నారు.. ఏవిధంగా?
నేను కావాల్సినంత డబ్బు సంపాదించాను. పేరే సంపాదించాను. మంచి ఫ్యామిలీ ఉంది. అభిమానులున్నారు. ఇప్పుడు నేను బాధ్యతగా వ్యవహరించాలి. వారికి నేనేం ఇవ్వగలను. మంచి సినిమాలను చేయడమే మార్గం. నేను ఈ విషయంలో కమల్‌ సార్‌ను ఫాలో కావడానికి ఇష్టపడతాను. ఎందుకంటే ఆయన హిట్స్‌, ప్లాప్స్‌ గురించి ఆలోచించరు. ఫ్రెష్‌ కంటెంట్‌ ఇవ్వడానికి ఇష్టపడతారు. అలాగే మనం ఓ సినిమాకు వెళితే అది మన ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఉండాలి.
 
తెలుగులో స్ట్రయిట్‌ సినిమా ఎప్పుడు చేస్తున్నారు?
తదుపరి మూవీ తెలుగులో చేయాలనుకుంటున్నాను. ఆ పాయింట్‌ తమిళ ఆడియెన్స్‌కు కనెక్ట్‌ అయితే తమిళంలో కూడా చేస్తాను. 
 
జ్యోతిక సినిమా ఎప్పుడు ఉంటుంది?
జ్యోతిక తమిళంలో చేసిన '36 వయదినిలే' చిత్రం తెలుగులో రిలీజ్‌ కావాల్సింది, కాలేదు. తన నెక్ట్స్‌ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ తుది దశకు చేరుకుంటుంది. మే నెలాఖరున ఆ సినిమాకు సంబంధించిన ప్రకటన చేస్తాను. 'కుట్రం కడితం' అనే సినిమాను డైరెక్ట్‌ చేసిన డైరెక్టర్‌ బ్రహ్మా ఈ సినిమాను డైరెక్ట్‌ చేస్తారు. 
 
త్రివిక్రమ్‌తో సినిమా చేస్తున్నట్లు వార్తవచ్చింది?
అది అతన్నే అడగాలి. ఎందుకంటే సాధారణ చర్చలు అయితే జరిగాయి కానీ తుది నిర్ణయం తీసుకోలేదు.