శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ 2017
Written By Raju
Last Updated :హైదరాబాద్ , సోమవారం, 24 ఏప్రియల్ 2017 (09:36 IST)

పేకమేడల్లా కూలిన రాయల్ ఛాలెంజర్స్, ఐపీఎల్ చరిత్రలో లోయెస్ట్ స్కోర్.. తొలి బంతికే కోహ్లీ డకౌట్

ఐపీఎల్ పదో సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ సొంతగడ్డపై బౌలింగ్‌లో అద్భుతం చేసింది. క్రిస్‌గేల్, కోహ్లి, డివిలియర్స్ లాంటి హిట్టర్లు ఉన్న బెంగళూరు జట్టుపై 132 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకుని 82 పరుగుల తేడా

ఐపీఎల్ పదో సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ సొంతగడ్డపై బౌలింగ్‌లో అద్భుతం చేసింది. క్రిస్‌గేల్, కోహ్లి, డివిలియర్స్ లాంటి హిట్టర్లు ఉన్న బెంగళూరు జట్టుపై 132 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకుని 82 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. బెంగళూరు జట్టు ఆల్‌రౌండ్ వైపల్యంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యల్ప స్కోరు నమోదైంది. ఐపీఎల్‌లో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్తో ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు దారుణ పరాభవం ఎదురైంది. 9.4 ఓవర్లలో 49 పరుగులు చేసి ఐపీఎల్ చరిత్రలోనే తక్కువ స్కోరు రికార్డును ఆర్సీబీ మూటకట్టుకుంది. 
 
గతేడాది అప్రతిహత విజయాలతో ఫైనల్స్‌కు దూసుకుపోయిన ఆర్సీబీ ఇక్కడ కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 82 పరుగుల తేడాతో ఘోర పరాభవాన్ని చవిచూసింది. 132 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బ్యాటింగ్‌కు దిగిన కోహ్లీ సేన కేవలం 9.4 ఓవర్లలోనే 49 పరుగులు చేసి ఆలౌటైంది. అంతకుముందు టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కోల్‌కతా19.3 ఓవర్లలో 131 పరుగులకు ఆలౌటైంది.
 
కోల్‌కతా నైట్ రైడర్స్‌ సంచలన ఓపెనర్ సునీల్ నరైన్ మరోసారి విధ్వంసం సృష్టించాడు. 17 బంతుల్లో 6 ఫోర్లు ఒక సిక్సర్ తో 34 పరుగులు చేశాడు. నరైన్ దూకుడుతో కేకేఆర్ 5.4 ఓవర్లలోనే 65 పరగులు చేసింది. ఆ తర్వాత ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. గంభీర్(14), ఉతప్ప(11), మనీశ్ పాండే(15), యూసఫ్ పఠాన్(8) స్వల్పస్కోర్లకే పరిమితమయ్యారు. చివర్లో వోక్స్ (18) చేయడంతో  131 పరుగులకే ఆలౌటై ఆర్సీబీ ముందు 132 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
 
132 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ కోహ్లీ తొలి బంతికే డకౌట్ అయ్యాడు. ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో ఏ ఒక్క బ్యాట్స్‌మన్ కూడా రెండంకెల మార్కు స్కోరు చేయలేకపోవడంతో ఐపీఎల్ చరిత్రలోనే అతి తక్కువ స్కోరుకు పరిమితమైంది. 17 బంతులాడిన క్రిస్ గేల్ 7 పరుగులు చేశాడు. మన్ దీప్ సింగ్(1), డివిలియర్స్ (8), స్టూవర్ట్ బిన్ని(8) విఫలమయ్యారు. ఆర్సీబీలో కేదార్ జాదవ్(9) దే అత్యధిక స్కోరు. కోల్టర్ నైల్, వోక్స్, గ్రాండ్ హోమ్ తలో 3 వికెట్లు తీసి ఆర్సీబీ పతనాన్ని శాసించారు.
 
టోర్నీలో ఏడు మ్యాచ్‌లాడిన కోల్‌కతా తాజాగా ఐదో విజయంతో పాయింట్ల పట్టికలో రెండో స్థానాన్ని సుస్థిరం చేసుకోగా.. ఐదో ఓటమితో బెంగళూరు ఏడో స్థానానికి పరిమితమైంది.