శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ 2019
Written By
Last Updated : సోమవారం, 13 మే 2019 (10:31 IST)

అందుకే మేం ఓడిపోయాం.. ముంబై ట్రోఫీని గెలుచుకుంది.. ధోనీ

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఓటమిపై ఆ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ స్పందించాడు. ఈ మ్యాచ్‌లో రెండు తప్పులు చేశామని.. కానీ అవి ముంబై కంటే ఒకటీ రెండు పొరపాట్లు ఎక్కువేనని చెప్పాడు. అయితే, ఛాంపియన్‌ను నిర్ణయించే కీలకమైన ఫైనల్‌ మ్యాచ్‌లో తప్పులు చేస్తే పరిహారం తప్పదని వ్యాఖ్యానించాడు.


కానీ తమ జట్టుకంటే ముంబై ఇండియన్స్ తక్కువ పొరపాట్లు చేయడం వల్లే ఫైనల్‌లో విజయం సాధించి ఛాంపియన్‌గా నిలిచిందని ధోనీ అన్నాడు. 
 
ఆదివారం రాత్రి హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రీడా మైదానంలో జరిగిన ఐపీఎల్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌ ఒకే ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. దీంతో నాలుగోసారి టైటిల్‌ కొట్టాలన్న చెన్నై ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. 
 
ఈ నేపథ్యంలో ఛాంపియన్‌గా నిలిచేందుకు ముంబైకి పూర్తి అర్హత వుందని.. అందుకే పైచేయి సాధించిందని చెప్పారు. తమ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారన్నారు. ఈ పిచ్‌పై 150 పరుగులకే ప్రత్యర్థిని కట్టడం చేయడం సులువైన పనికాదన్నాడు. 
 
వికెట్‌ అవసరమైన ప్రతీసారి బౌలర్లు వికెట్లు తీశారు. చెన్నై సూపర్‌ కింగ్స్‌కు ఇది మంచి సీజన్‌. మిడిల్‌ ఆర్డర్‌లో కొంచెం విఫలమైంది. వీటన్నింటి నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఏదేమైనా ఈ సంవత్సరం చాలా మంచి క్రికెట్‌ ఆడామని ధోనీ చెప్పుకొచ్చాడు.