గురువారం, 28 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ 2019
Written By
Last Modified: శనివారం, 13 ఏప్రియల్ 2019 (20:50 IST)

ధోనీని అలా నిషేధిస్తే సంతోషిస్తా.... వీరేంద్ర సెహ్వాగ్

కోపం అందరికీ సహజమే. ఒక్కోసారి ఆ కోపం ఎన్నో అనర్థాలను తెచ్చిపెడుతుంది. మిస్టర్ కూల్ అనే బిరుదును సొంతం చేసుకున్న టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్ మ్యాచ్ పోటీ సమయంలో వ్యక్తం చేసిన ఆగ్రహంపై ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 
 
అంపైర్ నోబాల్ ఇచ్చిన తర్వాత ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడంపై ధోనీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆ ఆగ్రహాన్ని అక్కడే అదిమిపెట్టకుండా బౌండరీ లైన్ ఆవల నుంచి ఎంతో ఆవేశంతో పిచ్ వద్దకు వచ్చి అంపైర్లతో వాగ్వివాదం పెట్టుకున్నాడు. ఐతే ఎంత ఆగ్రహాన్ని తెప్పించే సంఘటనలు జరిగినా మౌనంగా వుండే ధోనీ ఇలా చిన్న విషయానికి క్రీడాస్ఫూర్తిని మర్చిపోయాడంటూ మాజీ క్రికెటర్లు విమర్శిస్తున్నారు.
 
ఇక మరో మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ అయితే మరో అడుగు ముందుకు వేసి ఘాటు విమర్శలు చేశాడు. ఏదో ఐపీఎల్ జట్టు కోసం కాకుండా భారత జట్టు కోసం కోప్పడి వుంటే తను ఎంతో సంతోషించేవాడినని పేర్కొన్నారు. పిచ్ మీద ఇద్దరు బ్యాట్స్‌మన్లు ఉన్నప్పుడు అంపైర్ నిర్ణయాన్ని వాళ్లు ప్రశ్నించగలరనీ, బయట వున్న ధోనీకి ఏం పని అంటూ విమర్శించారు. ఇలా ప్రవర్తించే ఆటగాళ్లకు జరిమానా విధిస్తే సరిపోదనీ, రెండుమూడు మ్యాచ్‌ల నుంచైనా నిషేధం వేటు వేయాలంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు.