శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపిఎల్ 2020
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 4 అక్టోబరు 2020 (20:46 IST)

ఐపీఎల్ 2020 : లక్ష్య ఛేదనలో చతికిలపడిన సన్‌రైజర్స్ - ముంబై ఖాతాలో మరో గెలుపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020 టోర్నీలో భాగంగా, ఆదివారం ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య 17వ లీగ్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలపడింది. ముంబై ఇండియన్స్ నిర్ధేసించిన 208 పరుగుల భారీ విజయలక్ష్యాన్ని ఛేదించలేక 34 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఓ దశలో గెలుపు దిశగా సాగుతున్నట్టు అనిపించిన సన్ రైజర్స్ కీలక దశలో వికెట్లు చేజార్చుకుని కష్టాల్లో పడి, ఓటమిపాలైంది.
 
అంతకుముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇన్నింగ్స్‌ను పేలవంగా ఆరంభించింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఇన్నింగ్స్‌ మొదటి ఓవర్‌లోనే వెనుదిరిగాడు. సందీప్‌ శర్మ బౌలింగ్‌లో నాలుగో బంతిని భారీ సిక్సర్‌ బాదిన హిట్‌మ్యాన్‌ తర్వాతి బంతికే వికెట్‌ కీపర్‌ బెయిర్‌స్టోకు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. 
 
ఆ తర్వాత వన్డౌన్‌లో వచ్చిన సూర్యకుమార్‌ యాదవ్‌(27) ఎక్కువసేపు నిలువలేదు. ఈ దశలో ఇషాన్‌ కిషన్‌, డికాక్‌ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. డికాక్‌ చెలరేగుతుండగా ఇషాన్‌ అతనికి మద్దతుగా నిలిచాడు. అబ్దుల్‌ సమద్‌ వేసిన ఏడో ఓవర్లో ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న డికాక్‌... భారీ షాట్లతో విరుచుకుపడుతూ ఫోర్లు, సిక్స్‌లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఫలితంగా ముంబై ఇండియన్స్ భారీ స్కోరు చేసింది. 
 
ఓపెనర్ క్వింటన్ డికాక్ 39 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సులతో 67 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ 27, ఇషాన్ కిషన్ 31, హార్దిక్ పాండ్య 28, పొలార్డ్ 25, కృనాల్ 4 బంతుల్లో 20 పరుగులు సాధించారు. సిద్ధార్థ్ కౌల్ వేసిన ఇన్నింగ్స్ చివరి ఓవర్లో కృనాల్ ఏకంగా రెండు సిక్సులు, రెండు ఫోర్లు బాదడంతో ముంబయి స్కోరు 200 దాటి, నిర్ణీత 20 ఓవర్లలో 208 పరుగుల చేసింది.
 
ఆ తర్వాత బ్యాటింగ్‌కు స్వర్గధామం వంటి ఈ స్టేడియంలో ఇప్పటివరకు ఆడిన ఐపీఎల్ మ్యాచ్‌లో భారీస్కోర్లు నమోదయ్యాయి. ఛేజింగ్ చేసిన జట్లు కూడా 200 పరుగుల మార్కు దాటించాయి. ఈ క్రమంలో హైదరాబాద్ జట్టు కూడా భారీ విజయలక్ష్య ఛేదనకు బరిలోకి దిగింది. అయితే, 20 ఓవర్లలో 7 వికెట్లకు 174 పరుగులు మాత్రమే చేసింది.
 
ఓ దశలో గెలుపు దిశగా సాగుతున్నట్టు అనిపించిన సన్ రైజర్స్ కీలక దశలో వికెట్లు చేజార్చుకుని కష్టాల్లో పడింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ (44 బంతుల్లో 60, 5 ఫోర్లు, 2 సిక్సులు) రాణించాడు. బెయిర్ స్టో (15 బంతుల్లో 25), మనీష్ పాండే (19 బంతుల్లో 30) ఫర్వాలేదనిపించినా భారీస్కోర్లు నమోదు చేయలేకపోయారు. 
 
కేన్ విలియమ్సన్ (3), ప్రియమ్ గార్గ్ (8) విఫలం కావడం విజయావకాశాలపై తీవ్ర ప్రభావం చూపింది. చివరి వరుస బ్యాట్స్‌మన్ పోరాడేందుకు ప్రయత్నించినా, బుమ్రా, బౌల్ట్, పొలార్డ్‌ల కట్టుదిట్టమైన బౌలింగ్‌తో వారు స్వేచ్ఛగా బ్యాట్లు ఝుళిపించలేకపోయారు. ఈ బౌలర్లు హైదరాబాద్‌ జట్టును కట్టడి చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ విజయంతో ముంబై ఇండియన్స్ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది.