శుక్రవారం, 29 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపిఎల్ 2020
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 23 అక్టోబరు 2020 (12:21 IST)

ఐపీఎల్ 2020 : హమ్మయ్యా.. సమిష్టిగా రాణించారు.. విజయం సాధించారు...

యూఏఈ వేదికగా జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నీలో అన్ని వనరులు పుష్కలంగా ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు విజయం ముంగిట బోర్లాపడుతోంది. దీనికి కారణంగా ఆరంభంలో అదరగొడుతున్న ఆటగాళ్లు మ్యాచ్ ఆఖర్లు తుస్‌మని తేలిపోతున్నారు. ఫలితంగా విజయం అంచులకు వచ్చి ఓడిపోతూ వస్తోంది. 
 
అయితే, గత రాత్రి జరిగిన మ్యాచ్‌లో మాత్రం హైదరాబాద్ ఆటగాళ్లు సమిష్టిగా రాణించి అత్యంత కీలకమైన విజయాన్ని నమోదు చేశారు. నిజానికి కోల్‌కతాతో జరిగిన పేసర్‌ లూకీ ఫెర్గూసన్‌ ధాటికి విలవిల్లాడి సూపర్‌ ఓవర్‌లో హైదరాబాద్ జట్టు ఓడిపోయింది. కానీ, గురువారం రాత్రి రాజస్థాన్ రాయల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో మాత్రం విజయభేరీ మోగించింది. 
 
ఆ జట్టు బ్యాట్స్‌మెన్లు మనీశ్‌ పాండే 47 బంతుల్లో 4 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 83 (నాటౌట్), విజయ్‌ శంకర్‌ 51 బంతుల్లో 6 ఫోర్లు కొట్టి 52 (నాటౌట్) పరుగులు చేసి జట్టు విజయంలో కీలక భూమికను పోషించారు. ఫలితంగా వార్నర్‌ సేన ఈ సీజన్‌లో ఛేజింగ్‌లో తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. 
 
ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 154 పరుగులు చేసింది. సంజూ శాంసన్‌ 26 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో చేసిన 36 పరుగులు అత్యధిక స్కోరు కావడం గమనార్హం. మిగిలిన ఆటగాళ్లలో ఊతప్ప 19 (రనౌట్), స్టోక్ 30, బట్లర్ 9, స్మిత్ 19, పరాగ్ 20, తెవాటియా 2, అర్చర్ 16 చొప్పున పరుగులు చేశారు. ఫలితంగా 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. 
 
ఆ తర్వాత 155 పరుగులు విజయలక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ జట్టు... 18.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 156 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో సన్‌రైజర్స్‌కు శుభారంభం దక్కలేదు. ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌లోనే కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ (4) ఔట్‌కాగా.. మూడో ఓవర్‌లో బెయిర్‌స్టో (10) కూడా వెనుదిరిగాడు. ఈ రెండు వికెట్లు ఆర్చర్‌ ఖాతాలోకే వెళ్లాయి. 
 
కేవలం 16 పరుగులకే 2 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ హైదరాబాద్‌ను మనీశ్‌ పాండే ఆదుకున్నాడు. దూకుడైన బ్యాటింగ్‌తో ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచాడు. అతడికి విజయ్‌ శంకర్‌ చక్కటి సహకారం అందించాడు. ఈ క్రమంలో 28 బంతుల్లో అర్థ శతకం చేసిన పాండే.. సిక్సర్లతో విజృంభించి లక్ష్యాన్ని కరిగించాడు. 
 
ఆరంభంలో నెమ్మదిగా ఆడిన శంకర్‌ కూడా చివరకు బ్యాట్‌కు పనిచెప్పి అర్థశతకం పూర్తి చేసుకున్నాడు. ఈ జోడీ అభేధ్యమైన మూడో వికెట్‌కు రికార్డు స్థాయిలో 140 పరుగులు జోడించి జట్టుకు విజయాన్నందించింది. రాజస్థాన్‌ బౌలర్లలో ఆర్చర్‌కు 2 వికెట్లు దక్కాయి. మనీశ్‌ పాండేకు 'మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్' అవార్డు దక్కింది.