శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 16 ఏప్రియల్ 2020 (21:56 IST)

బెడిసికొట్టిన గంగూలీ ప్రయత్నాలు.. ఐపీఎల్ నిరవధిక వాయిదా

బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన భారత మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ స్వదేశంలో ప్రతి యేడాది అత్యంత ప్రతిష్టాత్మక ఐపీఎల్ టోర్నీని నిర్వహించాలని శతవిధాలా ప్రయత్నించారు. అయితే, ఆయన ప్రయత్నాలకు కరోనా వైరస్ గండికొట్టింది. ఈ వైరస్ వ్యాప్తి విజృంభణ కారణంగా ఈ టోర్నీని ఏకంగా నిరవధికంగా వాయిదా వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. 
 
నిజానికి కాసుల వర్షం కురిపించే ఈ టోర్నీ మార్చి 29వ తేదీ నుంచి ప్రారంభంకావాల్సివుంది. కానీ, కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఈ టోర్నీని ఏప్రిల్‌ నెలకి వాయిదా వేశారు. అయితే, పరిస్థితులు ఏమాత్రం చక్కబడక పోవడమే కాకుండా, కరోనా వైరస్ వ్యాప్తిలో ఏమాత్రం తగ్గుదల కనిపించకపోవడంతో ఈ టోర్నీని ఏకంగా రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. 
 
ఐపీఎల్ తాజా సీజన్ సాధ్యాసాధ్యాలపై బీసీసీఐ చీఫ్ గంగూలీ కొన్నిరోజులుగా ఆశాభావం వ్యక్తం చేస్తున్నా, నానాటికీ వైరస్ విజృంభణ తీవ్రమవుతుండడంతో కీలక నిర్ణయం తీసుకోకతప్పలేదు. తదుపరి నిర్ణయం తీసుకునేంత వరకు ఐపీఎల్‌ను వాయిదా వేస్తున్నట్టు బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది.
 
దేశ ప్రజల ఆరోగ్యం, భద్రతే తమకు అన్నింటికన్నా ముఖ్యం అని బీసీసీఐ కార్యదర్శి జయ్ షా పేర్కొన్నారు. ఫ్రాంచైజీ ఓనర్లు, ప్రసారకర్తలు, స్పాన్సర్లు, వాటాదారులందరూ పరిస్థితులు చక్కబడిన తర్వాత ఐపీఎల్ నిర్వహించాలని కోరుకుంటున్నారని వివరించారు. 
 
కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను పరిశీలిస్తున్నామని, కేంద్రం మార్గదర్శకత్వంలో కొనసాగుతామని తెలిపారు. సాధారణ పరిస్థితులు నెలకొన్న పిదప అందరినీ సంప్రదించి ఐపీఎల్ పునఃప్రారంభ తేదీని ప్రకటిస్తామని పేర్కొన్నారు.