గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , సోమవారం, 17 ఏప్రియల్ 2017 (01:57 IST)

ముంబై మెరిసెన్: వరుసగా నాలుగో విజయంతో అగ్రస్థానం

ప్రత్యర్ధి జట్లు మొత్తంగా ఈర్ష్యపడేలా అప్రతిహత విజయాలతో దూసుకుపోతున్న ముంబై ఇండియన్స్ ఐపీఎల్‌-10 సీజన్‌లో అదరగొడుతోంది. ఆదివారం ముంబయి ఇండియన్స్‌కు వరుసగా నాలుగో విజయం లభించింది. సొంతగడ్డపై ముంబై ఇండియన్స్‌ జట్టు అదరగొట్టింది. ఈ సీజన్‌లో వరుసగా నాలు

ప్రత్యర్ధి జట్లు మొత్తంగా ఈర్ష్యపడేలా అప్రతిహత విజయాలతో దూసుకుపోతున్న ముంబై ఇండియన్స్ ఐపీఎల్‌-10 సీజన్‌లో అదరగొడుతోంది.  ఆదివారం ముంబయి ఇండియన్స్‌కు వరుసగా నాలుగో విజయం లభించింది. సొంతగడ్డపై ముంబై ఇండియన్స్‌ జట్టు అదరగొట్టింది. ఈ సీజన్‌లో వరుసగా నాలుగో విజయాన్ని సాధించి తనకు ఎదురులేదని నిరూపించుకుంది. ఆదివారం వాంఖెడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో గుజరాత్‌ లయన్స్‌ జట్టును చిత్తుగా ఓడించింది.


ముందుగా గుజరాత్‌ లయన్స్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 176 పరుగులు చేసింది. బ్రెండన్‌ మెకల్లమ్‌ (44 బంతుల్లో 64; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ సెంచరీతో ఆకట్టుకోగా... దినేశ్‌ కార్తీక్‌ (26 బంతుల్లో 48 నాటౌట్‌; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ధాటిగా ఆడాడు. అనంతరం ముంబై ఇండియన్స్‌ జట్టు 19.3 ఓవర్లలో 4 వికెట్లకు 177 పరుగులు చేసి గెలిచింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ నితీశ్‌ రాణా (36 బంతుల్లో 53; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), రోహిత్‌ శర్మ (29 బంతుల్లో 40 నాటౌట్‌; 3 ఫోర్లు, 1 సిక్స్‌), పొలార్డ్‌ (23 బంతుల్లో 39; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపులు మెరిపించారు.
 
టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌ లయన్స్‌ గౌరవప్రదమైన స్కోర్‌ చేసింది. బ్రెండన్‌ మెక్‌కలమ్‌ (64), దినేశ్‌ కార్తీక్‌ (48 నాటౌట్‌) బ్యాటింగ్‌తో రోహిత్‌ సేనకు 177 పరుగుల లక్ష్యం నిర్దేశించింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన లయన్స్‌కు శుభారంభం లభించలేదు. ఓపెనర్‌ డ్వేన్‌ స్మిత్‌ (0) రెండో బంతికే వెనుదిరిగాడు. కెప్టెన్‌ సురేశ్‌ రైనా (28; 29 బంతుల్లో 2×4)తో కలిసి మెక్‌కలమ్‌ (64; 44 బంతుల్లో 6×4, 3×6) ఇన్నింగ్స్‌ నిర్మించాడు. మందకొడిగా ఉన్న పిచ్‌పై తొలుత ఆచితూచి ఆడినా మెక్‌కలమ్‌ తర్వాత చెలరేగాడు. అందివచ్చిన బంతుల్ని బౌండరీలు, సిక్సర్లు మలిచాడు. క్రునాల్‌ పాండ్యా వేసిన 10.3 బంతిని లెగ్‌సైడ్‌లో నెట్టి సింగిల్‌ తీసి ముంబయిపై నాలుగో అర్ధశతకం సాధించాడు.
 
మెక్‌కలమ్‌ అర్ధశతకం బాదిన కొద్దిసేపటికే కెప్టెన్‌ రైనా ఔటయ్యాడు. భజ్జీ వేసిన 11.1 బంతికి రోహిత్‌శర్మకు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తర్వాత రెండు ఓవర్లకే మెక్‌కలమ్‌ వెనుదిరిగాడు. మలింగ వేసిన 13.4వ బంతికి మెక్లెనగన్‌ చేతికి చిక్కాడు. ఈ దశలో వచ్చిన దినేశ్‌ కార్తీక్‌ (48 నాటౌట్‌; 26 బంతుల్లో 2×4, 2×6) వేగంగా ఆడాడు. ఇషాన్‌ కిషన్‌ (11)తో కలిసి చకాచకా సింగిల్స్‌, డబుల్స్‌ తీశాడు. వీలుచిక్కినప్పుడు బౌండరీలు, సిక్సర్లు బాది స్కోర్‌ను 1764కు చేర్చాడు. ముంబయి బౌలర్లలో మెక్లెనగన్‌ 2, మలింగ, హర్భజన్‌ చెరో వికెట్‌ తీసుకొన్నారు.
 
వరుస విజయాలతో మంచి ఊపు మీదున్న ముంబై ఇండియన్స్‌ 177 పరుగుల లక్ష్యాన్ని అవలీలగా ఛేదించింది. పరుగుల ఖాతా మొదలు పెట్టకుండానే ఓపెనర్‌ పార్థివ్‌ పటేల్‌ (0) వికెట్‌ను కోల్పోయిన ముంబై తర్వాత ఏ దశలోనూ ఇబ్బంది పడలేదు. రెండో ఓవర్లోనే ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న నితీశ్‌ రాణా ఆ తర్వాత బట్లర్‌ (24 బంతుల్లో 26; 1 ఫోర్‌ , 2 సిక్సర్లు)తో కలిసి వేగంగా పరుగుల్ని జోడించాడు.

54 బంతుల్లో 85 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాక ఏడు పరుగుల వ్యవధిలో వీరిద్దరూ అవుటయ్యారు. ఈ దశలో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, పొలార్డ్‌ వీలు చిక్కినప్పుడల్లా ఫోర్లు, సిక్సర్లు బాదుతూ ముంబైని లక్ష్యానికి చేరువ చేశారు. చివర్లో పొలార్డ్‌ అవుటైనా హార్దిక్‌ పాండ్యాతో కలిసి రోహిత్‌ మరో మూడు బంతులు మిగిలి ఉండగానే జట్టును గెలిపించాడు.