1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 29 జులై 2021 (18:09 IST)

వాట్సాప్‌కు చెక్... సందేశ్ అనే కొత్త యాప్ ప్రారంభం

వాట్సాప్ లో సెక్యూరిటీపై అనుమానాలు వ్యక్తమవుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం అలాంటి మరో కొత్త యాప్‌ను తీసుకువచ్చింది. సందేశ్‌గా ఆ యాప్‌కు పేరు పెట్టారు. ఈ యాప్‌కు సంబంధించిన వివరాలను కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ లోక్ సభకు వివరించారు.
 
ఈ యాప్ చాలా సురక్షితమైనదని తెలిపారు. ఈ యాప్‌కు సంబంధించిన నియంత్రణను కేంద్ర ప్రభుత్వమే చూసుకుంటుందని తెలిపారు. వాట్సాప్‌లో మాదిరిగా నే వన్ టూ వన్ మెసేజింగ్, గ్రూప్ మెసేజింగ్, ఫైల్, మీడియా షేరింగ్, ఆడియో, వీడియో కాల్స్, ఈ గవర్నమెంట్ అప్లికేషన్ తదితర ఫీచర్లు ఈ యాప్‌లో ఉండనున్నాయి. 
 
ఈ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్‌తో పాటు యాప్ స్టోర్‌లోనూ అందుబాటులో ఉంచుతున్నామని చంద్రశేఖర్ వివరించారు. ఈ యాప్ ను నేషనల్ ఎన్ఫోర్మేటిక్స్ సెంటర్(NIC) అభివృద్ధి చేసింది. NIC తో పాటు ప్రభుత్వ ఐటీ విభాగం కలిసి ఈ యాప్ ను లాంఛ్ చేశాయి.
 
కేవలం మొబైల్ నంబర్ తో పాటే కాకుండా ఈమెయిల్ తోనూ ఓపెన్ చేసేలా సందేశ్ యాప్ ను రూపొందించారు. అయితే ఇప్పటివరకు కేవలం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, సర్కారు ఏజెన్సీలు మాత్రమే వాడుతున్న ఈ యాప్ ఇప్పుడు అందరికీ అందుబాటులోకి వచ్చేసింది. 
 
ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం ఫోన్ నంబర్ ను నమోదు చేసి, ఓటీపీని వెరిఫికేషన్ ను పూర్తి చేస్తే ఈ యాప్ ను వాడుకోవచ్చు.
 
ఈ యాప్‌కు వెబ్ వెర్షన్ కూడా అందుబాటులో ఉంది. సందేశ్ వెబ్ పోర్టల్ ద్వారా దీనిని వినియోగించుకోవచ్చు. అందులో మొబైల్ నంబర్ లేదా ఈ మెయిల్ ఐడీని నమోదు చేయాల్సి ఉంటుంది. అనంతరం ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని నమోదు చేస్తే సందేశ్ వెబ్ ఓపెన్ అవుతుంది.
 
ఇప్పటివరకు ప్రభుత్వ ఈ మెయిల్ ఐడీతో మాత్రమే సందేశ్ లో ఖాతా తెరవాలనే నిబంధన ఉండేది. అయితే ఇప్పుడు ఈ నిబంధనను మార్చారు.