1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 30 అక్టోబరు 2019 (10:10 IST)

మొబైల్ కంపెనీల ధరల యుద్ధం.. జియోకు చెక్ పెట్టిన వోడాఫోన్

మొబైల్ కంపెనీల మధ్య ధరల యుద్ధం కొనసాగుతోంది. దేశంలోని అన్ని ప్రైవేట్ టెలికాం కంపెనీలను అణిచివేయాలన్న ధోరణితో రిలయన్స్ జియో సరికొత్త ప్లాన్స్‌ను ప్రవేశపెడుతోంది. దీంతో అప్రమత్తమైన ఇతర మొబైల్ ఆపరేటర్లు కూడా తమ వినియోగదారులను కాపాడుకునేందుకు జియోకు పోటీగా సరికొత్త ప్లాన్స్‌ను అందుబాటులోకి తెస్తున్నాయి. 
 
తాజాగా జియోకు వోడాఫోన్ చెక్ పెట్టింది. ఇటీవల జియో ఐయూసీ కాలింగ్ నిమిషాలతో మూడు కొత్త ఆల్‌ ఇన్ వన్ ప్యాక్‌లు.. రూ.222, రూ.333, రూ.444లను విడుదల చేసింది. దీంతో జియోను ఎదుర్కొనేందుకు వొడాఫోన్ ఐడియా రంగంలోకి దిగింది. రూ.229తో సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రకటించింది. 
 
ఈ ప్యాక్ ద్వారా వినియోగదారులకు గరిష్ట ప్రయోజనాలను అందించాలని, తద్వారా పడిపోతున్న యూజర్ బేస్‌ను కాపాడుకోవాలని భావిస్తోంది. ఎయిర్‌టెల్ ఇటీవల తీసుకొచ్చినట్టు రూ.169 ప్రీపెయిడ్ ప్లాన్‌ను విడుదల చేసిన వొడాఫోన్ తాజాగా 28 రోజుల చెల్లుబాటుతో ఈ కొత్త ప్లాన్‌ను విడుదల చేసింది.
 
రిలయన్స్ జియో రూ.222 ప్లాన్‌లో రోజుకు 2 జీబీ డేటా లభిస్తుంది. ప్లాన్ కాలపరిమితి 28 రోజులు. ఇతర నెట్‌వర్క్‌లకు కాల్ చేసేందుకు 1,000 నిమిషాలు లభిస్తాయి. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు కూడా ఉన్నాయి. జియో కంటే ఏడు రూపాయలు ఎక్కువే అయినా వొడాఫోన్ ప్లాన్‌లో వినియోగదారులు ఏ నెట్‌వర్క్‌కు అయినా దేశవ్యాప్తంగా అపరిమిత కాల్స్ చేసుకోవచ్చు. రోజుకు 2జీబీ డేటా 28 రోజుల కాలపరిమితితో లభిస్తుంది. రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు ఉచితంగా పంపుకోవచ్చు.