1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. కథనాలు
Written By ప్రీతి
Last Updated : గురువారం, 31 జనవరి 2019 (15:44 IST)

ఇతనో మంచి కిడ్నాపర్.. ఆడపిల్లలను కిడ్నాప్ చేసి.. ఏం చేస్తాడో తెలుసా?

ఆడపిల్లలు వద్దనుకుంటున్న ఈ కాలంలో ఒకతను చేస్తున్న పని తెలిస్తే ఆశ్చర్యం కలిగించక మానదు. ఢిల్లీలో కొద్ది రోజులుగా 8 నుండి 12 ఏళ్ల వయస్సు మధ్య ఉన్న బాలికల కిడ్నాప్ కేసులు నమోదువుతున్నాయి. తీరా పోలీసులు కేసు విచారిద్దామని పూనుకునేలోపే తమ పిల్లలు సురక్షితంగా ఇంటికి చేరారని తల్లిదండ్రుల నుండి ఫోన్ వస్తుంది. 
 
ఇలా చాలా కేసులు వచ్చే సరికి పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించగా ఒక వ్యక్తి బజాజ్ డిస్కవర్ బైక్‌లో ఈ పిల్లలను తీసుకుని వెళ్తున్నట్లు గుర్తించిన పోలీసులు దాదాపు 200 బైక్‌లపై నిఘా ఉంచి, అనుమానంతో కృష్ణ తివారీ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
 
వివరాలను పరిశీలించగా, ఢిల్లీలోని రాజౌరీ గార్డెన్స్‌లో డ్రైవర్‌గా పని చేస్తున్న కృష్ణ తివారికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే తివారీకి ఆడపిల్లలంటే చాలా ఇష్టం. తనకు ఆడపిల్ల లేదన్న బాధతో ఇలా ఆడపిల్లలను కిడ్నాప్ చేసి ఇంటికి తీసుకెళ్లేవాడు. అలా అని వారికి ఏ హాని తలపెట్టేవాడు కాదు. వారికి ఇష్టమైనవన్నీ కొనిచ్చి, మంచి భోజనం పెట్టి, రెండ్రోజులు తనతో ఉంచుకుని తిరిగి జాగ్రత్తగా తల్లిదండ్రుల వద్దకు పంపించేసేవాడు.
 
కిడ్నాప్‌కు గురైన బాలికలు కూడా తమను ఎలాంటి ఇబ్బంది పెట్టలేదని చెప్పడంతో ఆడపిల్లలంటే ఇష్టంతోనే ఈ పని చేసినట్లు, మరో ఉద్దేశమేమీ లేనట్లు భావిస్తున్న డిప్యూటీ కమీషనర్ ఇతడిని సైకాలజిస్ట్‌ వద్దకు పంపించాలనే ఆలోచనలో ఉన్నారు.