శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కృష్ణా పుష్కరాలు 2016
Written By JSK
Last Modified: శుక్రవారం, 12 ఆగస్టు 2016 (19:24 IST)

శ్రావ‌ణ మాసం... వ‌ర‌ల‌క్ష్మీ వ్ర‌తం... కృష్ణా పుష్క‌రం... సంద‌డే సంద‌డి...

విజ‌య‌వాడ ‌: శ్రావణమాసం.. పవిత్ర వరలక్ష్మి వ్రతం... ఇంత‌టి ప‌విత్ర రోజున కృష్ణమ్మ పుష్కరాలు ప్రారంభ‌మ‌య్యాయి. గురువారం రాత్రి నుంచే వివిధ ప్రాంతాల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు పుష్కర ఘాట్ల వద్దకు పయనమయ్యారు. శుక్రవారం వేకువ జామున ఐదు గంటలకు ఘాట్లకు చేర

విజ‌య‌వాడ ‌: శ్రావణమాసం.. పవిత్ర వరలక్ష్మి వ్రతం... ఇంత‌టి ప‌విత్ర రోజున కృష్ణమ్మ పుష్కరాలు ప్రారంభ‌మ‌య్యాయి. గురువారం రాత్రి నుంచే వివిధ ప్రాంతాల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు పుష్కర ఘాట్ల వద్దకు పయనమయ్యారు. శుక్రవారం వేకువ జామున ఐదు గంటలకు ఘాట్లకు చేరుకొని పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు. విద్యుత్ దీపాల ధగధగలతో జిల్లాలోని పలు ప్రాంతాలు వెలిగిపోయేలా అలంకరించింది. గుంటూరు జిల్లాలో మొత్తం 72 పుష్కర ఘాట్లలో యాత్రికులు పుణ్యస్నానాలు ఆచరించేందుకు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఆయా ఘాట్లకు సమీపంలోని దేవాలయాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. 
 
దూర ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికులు విశ్రాంతి తీసుకోవడానికి, కాలకృత్యాలు తీర్చుకోవడానికి 14 పుష్కర నగర్‌లను ఏర్పాటు చేశారు. జిల్లాలో విజయపురిసౌత్(కృష్ణవేణి) ఘాట్‌ మొదలుకొని పెనుమూడి ఘాట్‌ వరకు అన్నింటిలోకి స్వచ్ఛమైన కృష్ణా పుష్కర జలాలు చేరేలా అధికార యంత్రాంగం చర్యలు తీసుకొన్నది. జిల్లాలో ప్రధానంగా అమరావతి, తాళ్ళాయపాలెం, సీతానగరం, పెనుమూడి, విజయపురిసౌత, సత్రశాల, దైద, తంగెడ, పొందుగల పుష్కర ఘాట్లకు అధిక సంఖ్యలో యాత్రీకులు వస్తారని అంచనా వేస్తోన్నారు. 
 
ఆ ఘాట్లపై ప్రత్యేక దృష్టి సారించారు. నలుగురు ఆర్‌డీవోలను సమన్వయ అధికారులుగా నియమించారు. ప్రతీ ఘాట్‌లో మూడు షిఫ్టుల్లో సిబ్బంది పని చేసేలా 36 వేల మందికి డ్యూటీలు వేశారు. పుష్కరాల సందర్భంగా పారిశుధ్యంపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. గుంటూరు, అమరావతి ప్రాంతాల్లో శోభాయాత్ర నిర్వహించారు. అమరావతిలో జరిగిన పుష్కర శోభ యాత్రలో మంత్రి పుల్లారావు, కలెక్టర్‌ కాంతిలాల్‌ దండే, ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌లు కలిశాలతో పాల్గొన్నారు. అనంతరం అమరేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేశారు.
 
యాత్రికులను సురక్షితంగా ఘాట్ల వద్దకు తీసుకెళ్లి స్నానం ఆచరించిన తర్వాత తిరిగి భద్రంగా ఆర్‌టీసీ బస్టాండ్‌, రైల్వే స్టేషన్లకు చేరుస్తామని చెప్పారు. ఎక్కడా తొక్కిసలాట జరగకుండా ఘాట్‌, పుష్కరనగర్‌ వారీగా బందోబస్తు ప్లాన్ చేసుకోవడం జరిగిందన్నారు. శుక్రవారం నుంచి సోమవారం వరకు వరుసల సెలవు దినాలు(వరలక్ష్మి వ్రతం, రెండో శనివారం, ఆదివారం, స్వాతంత్య్ర దినోత్సవం) కావడంతో హైదరాబాద్‌ నుంచి పల్నాడు, ఫలక్‌నుమా, విశాఖ, చెన్నై, నారాయణాద్రి, గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో భారీ సంఖ్యలో తరలివచ్చారు.
 
స్వచ్ఛంద సంస్థలు పుష్కరాలకు వచ్చే భక్తులకు భోజన వసతిని కల్పిస్తున్నాయి. ఒక్క అమరావతిలోనే రోజుకు లక్ష మందికి భోజన వసతి కల్పించే విధంగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. గుంటూరు సమీపంలో ఏర్పాటు చేసిన పుష్కరనగర్‌లో రోజుకు పదివేల మందికి భోజన వసతి కల్పిస్తున్నారు. జిల్లాలో ఆర్టీసీ మొత్తం 905 సర్వీసులను నడుపుతోంది. పుష్కర నగర్ల నుంచి ఘాట్ల వద్దకు చేర్చేందుకు రవాణా శాఖ 473 ఉచిత బస్సులను ఏర్పాటు చేసింది. ముఖ్యంగా ట్రాఫిక్‌ సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు.