శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 22 మార్చి 2017 (17:20 IST)

చెన్నై : అశోక్ లేలాండ్ ఉద్యోగినికి కత్తిపోట్లు... మాజీ ఉద్యోగి ఘాతుకం

చెన్నైలో ఓ దారుణం జరిగింది. 31 యేళ్ళ అశోక్ లేలాండ్ మహిళా ఉద్యోగి కత్తిపోటుకు గురైంది. ఈ దారుణానికి ఆ కంపెనీ మాజీ ఉద్యోగే పాల్పడ్డాడు. అయితే, ఆ యువతి అదృష్టవశాత్తు ప్రాణాపాయం నుంచి బయటపడింది.

చెన్నైలో ఓ దారుణం జరిగింది. 31 యేళ్ళ అశోక్ లేలాండ్ మహిళా ఉద్యోగి కత్తిపోటుకు గురైంది. ఈ దారుణానికి ఆ కంపెనీ మాజీ ఉద్యోగే పాల్పడ్డాడు. అయితే, ఆ యువతి అదృష్టవశాత్తు ప్రాణాపాయం నుంచి బయటపడింది. బుధవారం ఉదయం జరిగిన ఈ దారుణ వివరాలను పరిశీలిస్తే... కోల్‌కతాకు చెందిన సుచిస్మిత అనే యువతి చెన్నైలోని అశోక్ లేలాండ్ కంపెనీ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ విభాగంలో గత మూడేళ్లుగా పని చేస్తూ.. వెస్ట్ మాంబళంలోని ఓ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్‌లో బస చేస్తోంది. ఈమె నివశించే హాస్టల్‌కు సమీపంలోనే శివకాశికి చెందిన రఘునాథ్ (23) అనే యువకుడు ఉంటున్నాడు. 
 
ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం 6.30 గంటల సమయంలో ఆఫీసుకు వెళ్లేందుకు సుచిస్మిత బస్టాపుకు నడుచుకుంటూ వెళుతోంది. ఆ సమయంలో కాపుకాసిన రఘునాథ్ ఆమె పొట్టలో కత్తితో పొడిచి పారిపోయేందుకు ప్రయత్నించి.. స్థానికుల చేతికి చిక్కాడు. దీంతో అతడిని పోలీసులకు అప్పగించి, యువతిని సమీపంలోని ఆస్పత్రిలో చేర్పించారు. 
 
అనంతరం రఘునాథ్ వద్ద పోలీసులు విచారణ జరపగా మీంజూరులోని అశోక్ లైలాండ్ కంపెనీలో పని చేసే సమయంలో సుచిస్మితతో గొడవలు పడుతూ వచ్చాడు. వీరిద్దరి మధ్య బస్సులో కూడా పలుమార్లు ఘర్షణ జరిగింది. ఈ విషయం కంపెనీ యాజమాన్యానికి తెలియడంతో రఘునాథ్‌ను ఉద్యోగం నుంచి తొలగించారు. దీంతో సుచిస్మితపై కక్ష పెంచుకున్నాడు. ఈ కారణంగానే బుధవారం కత్తితో దాడి చేసినట్టు రఘునాథ్ పోలీసులకు చెప్పాడు. కోయంబత్తూరులోని ఓ ప్రైవేట్ కాలేజీ గ్యాడ్యుయేట్ పూర్తి చేసిన రఘునాథ్ గత యేడాది కంపెనీలో చేరాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.